విద్యాబాలన్ నాకు కజినే కానీ.. ఆమె రిఫరెన్స్ వద్దనుకున్నా: ప్రియమణి

ప్రియమణి తెలుగు, తమిళంలో హీరోయిన్ గా రాణించింది. క్రేజీ హీరోయిన్ గా తనలో గ్లామర్ మాత్రమే కాదు.. నటన కూడా ఉందని ప్రూవ్ చేసింది. 2007లో తమిళ్ లో వచ్చిన ‘పరుత్తివీరన్’ సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించింది. నటనలో ఆమె చూపిన పరిణితి.. చూపే శ్రద్ధకు నిదర్శనం ఈ అవార్డు అని చెప్పాలి. అనంతరం కొన్నేళ్లు సినిమాలు చేసింది. ప్రస్తుతం ముస్తఫా రాజ్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్. అయితే.. ఇందులో నటించడానికి కారణం చెప్పుకొచ్చింది.

‘నిజానికి నేను ఫ్యామిలీ మ్యాన్ చేద్దామనుకోలేదు. దర్శకులు కథ చెప్పి వెళ్లిన తర్వాత చేద్దామా? వద్దా అనే సందేహంలో ఉన్నాను. కానీ.. నా భర్త ముస్తాఫా ప్రోత్సాహంతోనే సిరీస్ చేశాను. వాళ్లు వచ్చి నిన్ను అడిగారంటే.. నువ్వు సిరీస్ లో ఉండాలనే కదా..?’ అని అనడంతో నా డౌట్ క్లియర్ అయింది. దీంతో ఈ సిరీస్ లో చేశానని చెప్పుకొచ్చింది. నిజానికి ఫస్ట్ పార్ట్ లో ప్రియమణి క్యారెక్టర్ ఎక్కువ. రెండో పార్ట్ లో మొత్తం సమంత చుట్టూనే కథ తిరగడంతో ప్రియమణికి ప్రాధాన్యం తగ్గింది. అయినా.. ప్రియమణికి వచ్చిన పేరు తక్కువేం కాదు. తనదైన నటనతో భర్తకు సమస్యలు తెచ్చిపెడుతూ చక్కగా నటించిందనే పేరు తెచ్చుకుంది.

సిరీస్ గురించే కాకుండా మరికొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంది. ప్రియమణికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కజిన్ అవుతుంది. ఇదే విషయంపై చెప్తూ.. ‘విద్యాబాలన్ నాకు కజినే. కానీ.. ప్రత్యేకించి కలిసింది లేదు. వాళ్ల నాన్నగారిని ఎక్కువగా కలుస్తూంటాను. కెరీర్లో ఉండగా కూడా నేను విద్యాబాలన్ పేరు ఉపయోగించుకోలేదు. ఆమె పేరు, బంధం చెప్తే నాకు అవకాశాలు వస్తాయి. కానీ.. నేను ఆ అవకాశాన్ని పొందాలనుకోలేదు. నాకై నేను చేసిన ప్రయత్నాలు నాకు కొన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయి’ అని చెప్పుకొచ్చింది. సినిమాలు లేకపోయినా రియాలిటీ షోస్ కి జడ్జిగా వస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఫ్యామిలీ మ్యాన్ హిట్ తో మరిన్ని అవకాశాలు పొందుతుందేమో చూడాలి.