‘పవిత్ర బంధం’ సీరియల్ నటి ఆత్మహత్య ,ఏం జరిగింది ?

తెరపై వెలిగిపోదామని వచ్చిన వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. తెలుగులో పలు సీరియళ్లలో నటించిన ఆమె మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా ఝాన్సీ గుర్తింపు పొందారు. ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణం అని తెలిస్తోంది.

పంజాగుట్ట ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వాడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21) పంజాగుట్ట ఠాణా పరిధిలోని నాగార్జుననగర్‌ సాయిరాం రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆమె బ్యూటీ పార్లర్‌ కూడా నిర్వహిస్తున్నారు.

విజయవాడకు చెందిన సూర్య అనే కుటుంబ స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత నాలుగైదు రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు సోదరుడు దుర్గాప్రసాద్‌ తెలిపారు. మంగళవారం రాత్రి దుర్గాప్రసాద్‌ ఇంటికి వచ్చాక తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే ఆమె ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. దుర్గాప్రసాద్‌ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఝాన్సీ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే..

పెళ్లి ప్రతిపాదన పెట్టడంతో ఝాన్సీని సూర్య దూరం పెట్టాడు. మరోవైపు అతని కోసం సీరియల్స్‌కు సైతం ఆమె దూరమయ్యారు. నటనను వదులుకోవడం సూర్య మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.