ప్రమాదం తన వల్ల జరగలేదంటూ క్లారిటీ ఇచ్చిన హీరో

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. హీరో సుధాకర్ ఇంకా ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు. ఈ విషయపై, సుధాకర్ మాట్లాడుతూ, తాను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే బతికి బయటపడ్డానని తెలిపారు. అయితే, అందరూ అనుకుంటున్నట్టు ప్రమాద సమయంలో వాహనం నడుపుతోంది తాను కాదని, డ్రైవర్ నడుపుతుంటే తాను పక్క సీట్లో కూర్చుని ఉన్నానని స్పష్టం చేశారు. తమ కారు డ్రైవర్ కూడా ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగిస్తోందని హీరో సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు.

. ‘నేను డ్రైవర్ పక్కసీటులో ఉన్నాను. కారు ట్రక్కుకు తగలడంతో ప్రమాదం జరిగింది. నేను డ్రైవింగ్‌ చేయలేదు. నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. మహిళ మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఈ ఘటనకు నేను కారణం కాదు. ఆ సమయంలో డ్రైవర్ కారుని నడుపుతున్నారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మృతురాలు కుటుంబానికి మా చిత్ర బృందం తరఫున, ప్రత్యేకంగా నేను సాయం చేస్తాను’ అని స్పష్టం చేశారు.

తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అదేనని అన్నారు. అందరికీ మెసేజ్ లు పంపిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైందని, సీటు బెల్టు లేకుంటే తలకు దెబ్బ తగిలేదని తెలిపారు. ప్రమాదం తర్వాత పోలీసులు, మీడియా ప్రతినిధులు ఎంతో సాయం చేశారని సుధాకర్ వెల్లడించారు. ప్రమాదంలో తన ఫోన్ పోయిందని, దాంతో ఎవరికీ సమాచారం అందించలేకపోయానని వివరించారు. అయితే, ఆ సమయంలో తానే కారు నడుపుతున్నట్టు కొన్ని వెబ్ సైట్లు రాశాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దని అన్నారు.

ఇక గుంటూరు జిల్లాలో శనివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్దవేగంగా వెళుతున్న ఆ కారు.. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా… కారు అదుపుతప్పి డివైడర్ ను గుద్దుకుంది. ప్రమాద సమయంలో కారులో వెళుతున్న నటుడు సుధాకర్ కోమకులకు గాయాలయ్యాయి.

సుధాకర్‌.. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘నువ్వు తోపురా’ సినిమాలో హీరోగా నటించారు. మే 3న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

నువ్వు తోపురా సినిమా ప్రచారంలో భాగంగానే సుధాకర్.. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.