ఏదైనా రీమేక్ సినిమాలో నటించాలంటే మన వెటరన్ హీరోలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రీమేక్ హక్కుల్ని కొనుక్కున్నా టైమ్ చూసి స్క్రిప్టును సిద్ధం చేయించి ప్రతిదీ పక్కాగా కుదిరితేనే సెట్స్ పైకి వెళుతున్నారు. ఆ కోవలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ క్రేజీ రీమేక్ కోసం సన్నాహాలు చేస్తున్నారని ప్రచారమవుతోంది.
మలయాళ చిత్రం `అయ్యప్పన్ కొరివియాన్` రీమేక్ లో బాలయ్య నటిస్తారని ఇటీవల ప్రచారమైంది. అయితే దీనిపై నటసింహా లాక్ డౌన్ వేళ ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు. ప్రివ్యూ చూసి అప్పుడు నిర్ణయిస్తానని బాలయ్య బిగ్ షాకిచ్చారట. అంటే ఇప్పటివరకూ ఈ మూవీ ప్రివ్యూని బాలయ్య చూడనే లేదు. అలాగే దర్శకుడు ఎవరు? అన్నది కూడా ఫిక్సవ్వలేదు. ప్రస్తుతం ఈ మూవీ రీమేక్ ని తెరకెక్కించేందుకు పలువురు దర్శకులు వెంటపడుతున్నారట. అయితే ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుంది? అన్నది ఇప్పటికి సస్పెన్స్.
మరోవైపు బాలయ్యతో సినిమా చేసేందుకు బి.గోపాల్, శ్రీవాస్ లాంటి ఆస్థాన దర్శకులు ప్రయత్నాల్లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరికి రీమేక్ అవకాశం దక్కుతుంది? అన్నది చూడాలి. రేసులో యంగ్ రైటర్ కం సక్సెస్ డైరెక్టర్ అనీల్ రావిపూడి పేరు కూడా వినిపిస్తోంది. వీళ్లలో ఎవరు స్ట్రెయిట్ కథతో చేస్తారు? రీమేక్ ని చేపడతారు? అన్నది చూడాలి.
అయినా బాలయ్య మునుపటితో పోలిస్తే చాలా మారారు. భజనలు చేస్తే అవకాశం ఇవ్వడం లేదు. అలాంటి బ్యాచ్ ని కూడా దరి చేరనివ్వడం లేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఛాన్సెవరికి ఇస్తారు? అన్నది చూడాలి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఎన్.బీ.కే 106 సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల చిత్రీకరణ వాయిదా పడింది.