నానీ-మారుతి `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` సీక్వెల్?

                                   మ‌ళ్లీ మ‌తిమ‌రుపు కాన్సెప్టేనా? ఇంకేదైనానా?

నాని – లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా మారుతి తెర‌కెక్కించిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. మ‌తి మ‌రుపు నేప‌థ్యంలో కాన్సెప్ట్ వంద‌శాతం వ‌ర్క‌వుటైంది నానీకి. అప్ప‌టికే కెరీర్ ప‌రంగా పూర్తి డైల‌మాలో ప‌డిపోయిన నేచుర‌ల్ స్టార్ ని ప‌ట్టాలెక్కించిన గొప్ప చిత్ర‌మిది. ఆ త‌ర్వాత నాని కెరీర్ ధేధీప్యమానంగా వెలిగిపోయింది. గ‌త కొంత‌కాలంగా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సీక్వెల్ గురించి క‌థ‌నాలొస్తున్నా.. ఎప్పుడు సెట్స్ కెళుతున్న‌దీ తేల‌లేదు.

నాని ప్రస్తుతం `టక్ జగదీష్` అనే చిత్రం‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్స్ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో పాటు `శ్యామ్ సింఘ‌రాయ్` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. మారుతితో నేచుర‌ల్ స్టార్ నాని సీరియ‌స్ గా ఓ స్క్రిప్టు విష‌య‌మై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌.

ద‌ర్శ‌కుడు మారుతి ఇటీవ‌లే నానీని క‌లుసుకుని క‌థ‌ను వినిపించాడ‌ట‌. స‌న్నివేశాల గురించి కూడా చర్చించారని తెలుస్తోంది. మారుతి త‌న‌ కథతో నానీని ఆకట్టుకున్నాడు. సూత్రప్రాయంగా ఆమోదం తెలిపార‌ని స‌మాచారం. మారుతి ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాస్తున్నట్లు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం అనుకున్న‌వ‌న్నీ జరిగితే, భలే భలే మగడివోయ్ జోడీ రిపీట‌వ్వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ జోడీ రెండవ ప్రాజెక్ట్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే వీలుంది. ఇది భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సీక్వెల్ అని భావిస్తున్నారు.  జీఏ2-యువి క్రియేష‌న్స్ సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.