ప్రస్తుతం తీస్తున్న సినిమాలన్నీ ఏదో ఒక రకంగా మల్టీస్టారర్ కేటగిరీలోకి చేరిపోతున్నాయి. భారీ బడ్జెట్లు భారీ కాన్వాసుతో తెరకెక్కుతున్న సినిమాలే కాదు .. నవతరం హీరోలు నటిస్తున్న సినిమాలు ఈ కేటగిరీలోనే ఉన్నాయి. బాహుబలి సిరీస్ తో రాజమౌళి మల్టీస్టారర్ ట్రెండ్ మరో లెవల్ కి చేరుకుంది. ఇటీవల రిలీజైన సాహో చిత్రంలో టాలీవుడ్ నటీనటులతో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు ముఖ్య భూమికలు పోషించారు. అక్టోబర్ 2న రిలీజవుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఇండియా లెవల్లోనే భారీ మల్టీస్టారర్. ఇందులో చిరంజీవితో పాటు అమితాబ్, సుదీప్,సేతుపతి వంటి స్టార్లు నటించడంతో పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపాంతరం చెందింది.
మల్టీస్టారర్ ట్రెండ్ కేవలం ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకే కాదు.. చిన్నా చితకా సినిమాలకు ఇదే సన్నివేశం ఉంది. వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ (వాల్మీకి) చిత్రంలోనూ అధర్వ ఇంపార్టెంట్ పాత్రలో నటించగా.. నితిన్ ఓ అతిధిపాత్రలో తళుక్కుమన్నాడు. ఒకరకంగా మల్టీస్టారర్ అప్పీల్ వచ్చింది దీంతో. నేడు రిలీజైన డబ్బింగ్ చిత్రం బందోబస్త్ భారీ మల్టీస్టారర్ గా వచ్చింది. ఇందులో సూర్యతో పాటు మోహన్ లాల్, ఆర్య వంటి స్టార్లు నటించారు. ప్రతివారం రిలీజవుతున్న సినిమాల్లో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించనవి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఈ ట్రెండ్ చూస్తుంటే హీరోల మధ్య స్నేహం మరో లెవల్ ని టచ్ చేస్తోంది.
సౌత్ లో ఇది ఇప్పుడే వచ్చిన ట్రెండ్ అయినా హాలీవుడ్ ని చూసి బాలీవుడ్ ఏనాడో నేర్చుకుంది. తెలుగు సినిమా క్లాసిక్ డేస్ లో అగ్ర హీరోలు ఈ తరహాలో ప్రయత్నించారు. అయితే మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటాపోటీగా సోలో లీడ్ పాత్రలతో హీరోయిజాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లినప్పుడు ఈ ట్రెండ్ లేదు. కానీ మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ గత నాలుగైదేళ్లుగా పీక్స్ లో ఉంది.
