దాస‌రి కొడుకుల ఆస్తి గొడ‌వ‌లో చిరును ఇరికించారా?

Megastar Chiranjeevi

ఆస్తి గొడ‌వ చిరు తీరుస్తారా?

లెజెండరీ డైరెక్టర్ దివంగత దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్ద‌గా టాలీవుడ్ లో ఏ స‌మ‌స్య ఉన్నా ప‌రిష్క‌రించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అన్ని వివాదాలు, సమస్యలను పరిష్కరించిన గొప్ప వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్లు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, కార్మికులు అంద‌రూ సమస్యలను పరిష్కరించడానికి ఆయ‌న‌ను సంప్రదించేవారు.

దాస‌రి మ‌ర‌ణానంత‌రం ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి నెమ్మదిగా రీప్లేస్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీ స‌హా ఇండ‌స్ట్రీలో ఇతర కార్యకలాపాలతో ఆయ‌న పాపులారిటీ అమాంతం పెరిగింది. ప‌రిశ్ర‌మ‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా నేనున్నాను అని ముందుకొస్తుండ‌డం కొంత భ‌రోసాని ఇస్తోంది. ఇప్పుడు, చిరంజీవి దాసరి నారాయణరావు కొడుకుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి రెడీ అవుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

దాసరి వార‌సుల మ‌ధ్య ఆస్తి త‌గాదా తెలిసిందే. దిగ్ధ‌ర్శ‌కుని పెద్ద కుమారుడు ప్రభు తన తమ్ముడు అరుణ్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు బుధవారం రాత్రి తన ఇంట్లోకి చొరబడి, తనను అతని భార్యను ఆస్తి పత్రాలపై సంతకం చేయమని బెదిరించాడ‌ని ఆరోపించారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది.

మీడియాలో ఈ ప్ర‌చారం గురించి తెలిసిన వెంట‌నే దాసరి కుమారులను చిరంజీవి పిలిచార‌ని.. వారి మధ్య స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారని ప్ర‌చారం సాగుతోంది. అయితే త‌మ కుటుంబ వ్య‌వ‌హారాల్లో చిరంజీవి జోక్యం త‌గ‌ద‌ని అరుణ్ కుమార్ మీడియా స్టేట్ మెంట్ ఇచ్చార‌ని ఒక సెక్ష‌న్ మీడియా ప్ర‌చారం చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. మోహ‌న్ బాబు- ముర‌ళీమోహ‌న్- సి.క‌ళ్యాణ్ వంటి పెద్ద‌లు త‌మ గొడ‌వ‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌ర‌ని దాస‌రి పెద్ద కుమారుడు ప్ర‌భు చెబుతున్నా.. సినీపెద్ద‌ల అవ‌స‌రం లేద‌ని త‌న‌తో కూచుని మాట్లాడితే ప‌రిష్కారం సులువుగానే దొరుకుతుంద‌ని త‌న అన్న ప్ర‌భుని అరుణ్ కుమార్ అభ్య‌ర్థించారు. కొడుకులు తండ్రి ప‌రువు తీశార‌న్న అప‌వాదు వ‌ద్ద‌ని కూడా అన‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.