పట్టాలెక్కనున్న మహేష్ – సందీప్ రెడ్డి వంగా సినిమా

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇంతటి సంచలనానికి తెరలేపిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి ప్రాజెక్ట్ ఏమై ఉంటుంది? అతడి నుంచి ఎలాంటి చిత్రం రాబోతోంది.. ఆ సినిమాలో హీరో ఎవరు? అని ప్రేక్షకుల్లోనే కాదు పరిశ్రమలోనూ హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. అందరి దృష్టీ దర్శకుడు సందీప్ రెడ్డి పైనే.

మరి 2 సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన అలాంటి దర్శకుడు తన తదుపరి చిత్రానికి ఎంచుకున్న హీరో ఎవరో తెలుసా? అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలిసి అంతా అవాక్కయ్యారు.ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుకు కథ వినిపించిన సందీప్ రెడ్డి ఫైనల్ నేరేషన్ కు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్నీ సందీప్ రెడ్డి సైతం ధృవీకరించారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తారని తెలిసింది. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో.. చూడాల్సిందే మరి!