మహేష్ ‘ద్విపాత్రాభినయం’ అని మురస్తున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన సమయం వచ్చేసింది . మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో అభిమానులు, మీడియా సందర్శనార్థం ఉంచారు.

కొద్ది సేపటి క్రితమే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలి వచ్చి చూసారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సూపర్ స్టార్.. తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.

మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. అయితే ఇద్దరు మహేష్‌లను ఒక్కచోట చూసిన అభిమానులు ఇంతకీ ఎవరు నిజం, ఎవరు విగ్రహం అనేది కన్ఫూజ్ అవటం ముచ్చటగా ఉంది.దాంతో మహేష్ డ్యూయిల్ రోల్ లో నటిస్తున్న సినిమా చూస్తున్నట్లు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం మహేశ్‌ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్‌ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్‌ వద్ద బారులు తీరారు.