విజయశాంతిని ఉద్దేశిస్తూ మహేష్ ట్వీట్‌

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి ఆఖరిగా కనిపించిన చిత్రం ‘నాయుడమ్మ’ (2006). ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయి, సినిమాలకు దూరం అయ్యారు. ఇన్నేళ్లల్లో మళ్లీ ఆమెను సినిమాలు చేయమని పరిశ్రమ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు. అయితే ఇన్నాళ్లకి విజయశాంతి తెర మీద కనిపించడానికి ఓకే అన్నారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్న ‘సరి లేరు నీకెవ్వరు’ సినిమాలో కీలకంగా నిలిచే పాత్ర చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సీనియర్‌ నటి విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆమె 53వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌తోపాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.

‘జన్మదిన శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీతో కలిసి మరోసారి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది మీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మహేష్ పేర్కొన్నారు.

‘ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నా విజయశాంతి గారు. మీ రీ ఎంట్రీ గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా మేడమ్‌’ అని అనిల్‌ రావిపూడి పోస్ట్‌ చేశారు. మహేశ్‌-అనిల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయశాంతి నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ (1989) సినిమాలో మహేశ్‌ బాలనటుడిగా కనిపించారు.