మెగాస్టార్‌కి పెనుప్ర‌మాదం త‌ప్పిందా?

మెగాస్టార్ చిరంజీవి ఊహించ‌ని ఓ పెను ప్ర‌మాదం నుంచి సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అస‌లేమైంది అన్న వివ‌రాల్లోకి వెళితే… ముంబై నుంచి హైదరాబాద్ బ‌య‌ల్దేరిన విమానానికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పిద‌ని ఆ విమానంలో మెగాస్టార్ చిరంజీవి స‌హా 120 మంది ప్రయాణీకులు ఉన్నార‌ని తెలుస్తోంది. పైలెట్ అప్ర‌మ‌త్త‌తోనే ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. ముంబై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌ల్దేరిన ఆ విమానం అర్థ‌గంట పాటు ప్ర‌యాణించింది. అయితే అనూహ్యంగా సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింద‌ని గుర్తించి తిరిగి వెన‌క్కి మ‌ళ్లించి ముంబై విమానాశ్ర‌యంలోనే దించేశార‌ట‌. ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ‌వ్వ‌డంతో ఓ పెను ప్ర‌మాదం త‌ప్పింద‌నే ప్ర‌యాణీకులు ఊపిరి పీల్చుకున్నార‌ని తెలుస్తోంది.

ఊహించ‌నిది జ‌రిగితే?
మెగాస్టార్ న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ కోసం ముంబై వెళ్లిన చిరు అక్క‌డ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని ఈ ఘ‌ట‌న ప్ర‌స్తుతం మెగాభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్ర‌మాదం ఏ విమానంలో అని ఎంక్వ‌యిరీ చేస్తే.. విస్తారా (యూకె 869) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ వారి కోసం విస్తారా ప్ర‌తినిధులు వేరొక విమానాన్ని ఏర్పాటు చేశార‌ని తెలిసింది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిజానిజాలేమిటి అన్న‌దానిపై మెగా కాంపౌండ్ స్పందించాల్సి ఉంది.