ప్రభుత్వ పోర్టల్ తో టిక్కెట్టు దోపిడీకి చెక్
ఆన్ లైన్ పోర్టళ్ల టిక్కెట్టు దోపిడీపై ఏడాది కాలంగా రివ్యూలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే చెక్ పెట్టేందుకు వ్యూహం రచించిన సంగతి తెలిసిందే. మూవీ టిక్కెట్ల అమ్మకాల్లో ప్రయివేటు పోర్టళ్ల దోపిడీపై పక్కాగా లెక్కలు తీసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి ఇకపై ప్రభుత్వమే పోర్టల్ ని ప్రారంభించే యోచనలో ఉందని ప్రకటించడం సంచలనమైంది.
త్వరలోనే ఈ పోర్టల్ ని లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ పోర్టల్ రూపకల్పన వ్యవహారాలు చూసేది ఎవరు? అంటే ఓ సీనియర్ మంత్రి కుమారుడు అని చెప్పుకుంటున్నారు. ఎవరా మంత్రి కుమారుడు? అది తలసాని వారసుడేనా లేక ఇంకెవరైనానా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే సదరు మంత్రి గారి వారసుడు ఓ నలుగురు టాలీవుడ్ స్టార్లను కలుపుకుని ఈ పోర్టల్ ని రూపొందించనున్నారట. ప్రభుత్వమే పోర్టల్ నిర్వహిస్తే అవినీతి రహితంగా ప్రజాపక్షంగా ఉంటుందన్నది వీళ్ల ఆలోచన. ఈ పోర్టల్ ని తెరపైకి తేవడం ద్వారా పేటీఎం, బుక్ మై షో వంటి వాటికి పెద్ద పంచ్ పడనుందని అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ పోర్టళ్ల మొహాలు చూసి చూసి విసుగెత్తిపోయిన జనాలకు కొత్తగా ప్రభుత్వ పోర్టల్ ట్రీటిస్తుందట.
అలాగే ప్రభుత్వ పోర్టల్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి జీఎస్టీ భారీ మొత్తం వసూలవుతుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు గజకర్ణగోకర్ణ కేటుగాళ్లు అసలు ఎన్ని టిక్కెట్లు అధికారికంగా అమ్ముడవుతాయో .. ఎన్ని బ్లాక్ లో అమ్ముడవుతాయో బయటకు తెలిసేది కాదు. ప్రతిదీ బ్లాక్ మార్కెట్లో అమ్మడమే అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు టిక్కెట్లను బ్లాక్ లో అమ్మిస్తూ ఆన్ లైన్ లో కొనేవాళ్లకు అందకుండా బ్లాక్ చేసేస్తుండడం బయటపడింది. అలాగే ఒక్కో టిక్కెట్టుపై రూ.40 మొదలు ఆపై ఎంతకు అయినా ఫీజుల పేరుతో బాదేసేవారు. ఈ దోపిడీని ప్రజలు చాలాకాలంగా భరించేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తలసాని సహా పలువురు రెవెన్యూ అధికారులు సహా చాలామంది నిపుణుల సమక్షంలో రివ్యూలు చేసి దొంగల్ని కనిపెట్టారు. అందుకే ఇప్పుడు మొత్తం అత్యాశాపరులందరికీ చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త పోర్టల్ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలుస్తోంది.
