గేమ్ వెనక ఎవరున్నారు?
కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఫార్స్ ఫిల్మ్స్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న పేరిది. భారీ స్థాయి చిత్రాల్ని మాత్రమే పంపిణీ చేస్తున్న ఈ సంస్థ ముఖ్యంగా దుబాయ్కి చెందిన ఓ ప్రముఖ కంపెనీకి చెందినదిగా చెబుతున్నారు. `సాహో`తో ఈ సంస్థ పంపిణీ రంగంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే చిరంజీవి నటిస్తున్న`సైరా` హక్కుల్ని అత్యంత భారీ మొత్తం కోట్ చేసి సొంతం చేసుకుంది. రజనీ నటిస్తున్న `దర్బార్`, రామ్చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రాల ఓవర్సీస్ హక్కుల్ని సొంతం చేసుకున్న ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ తాజాగా ఈ సంక్రాంతి రేస్కి సిద్ధమవుతున్న ఓ చిత్రానికి 8 కోట్లు ఆఫర్ చేసినట్టు వినిపిస్తోంది.
ఫార్స్ ఫిల్మ్స్ అత్యధికంగా దక్షిణాది చిత్రాలు, అందులో తెలుగు చిత్రాలపైనే అత్యధికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో ఫార్స్ నెంబర్ వన్గా మారాలన్నది వారి ఆలోచన. ఇప్పటికే భారీ చిత్రాల్ని సొంతం చేసుకుని మార్కెట్లో క్రేజ్ని సొంతం చేసుకున్న ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ పెట్టుబడులపై టాలీవుడ్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వస్తోంది?. ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.
బ్లాక్ మనీని అలా వైట్ చేసేస్తున్నారా?
మరో రూమర్ ఏంటంటే బడాబాబులంతా చేరి ఈ సంస్థ ద్వారా తమ బ్లాక్ మనీని వైట్ చేసుకుంటున్నారా? అన్నది మరో వాదన. దుబాయ్ మార్కెట్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆధిపత్యం చెలాయించాలన్నది ఫార్స్ ఫిల్మ్స్ అధినేతల ఎత్తుగడగా చెబుతున్నారు. `సాహో`ని 20 కోట్లకు కొంటే పెట్టిన పెట్టుబడిపోను బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్ని అందించింది. ఫార్స్ ఫిల్మ్స్ వెనక ఏం జరుగుతోంది?. ఎవరున్నారన్నది మరి కొన్ని నెలల్లో బయటపడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
