శంక‌ర్‌తో పోల్చొద్ద‌న్న యంగ్ డైరెక్ట‌ర్

శంక‌ర్‌తో పోల్చొద్ద‌న్న యంగ్ డైరెక్ట‌ర్

ప్ర‌భాస్, శ్రద్ధా క‌పూర్ జంట‌గా సుజీత్ తెర‌కెక్కించిన `సాహో` ఆగ‌స్టు 30న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. యువి క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌స్తుతం సాహో ప్ర‌చారంలో స్పీడ్ పెంచింది టీమ్. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని హైద‌రాబాద్ మీడియాకి ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన మీడియా చిట్ చాట్ లో ద‌ర్శ‌కుడు సుజీత్ తెలుగు మీడియా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. 

`ర‌న్ రాజా ర‌న్` రిలీజైన‌ ఐదేళ్ల త‌ర్వాత నేను తెర‌కెక్కించిన సినిమా రిలీజ‌వుతోంద‌ని సుజీత్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. సాహో ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే చాలా ఎక్కువ స‌మ‌యం తీసుకున్నామ‌ని .. ఇన్నేళ్లు ప‌ని చేయ‌డం వ‌ల్ల ప‌ది సినిమాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ఒక్క `సాహో` తోనే వ‌చ్చింద‌ని సుజీత్ తెలిపారు. ఈ సినిమా తీయాల‌నుకోవ‌డానికి కార‌ణం.. బాలీవుడ్ ని మ్యాచ్ చేద్దామ‌నో లేదా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజులో తీయాల‌నో చేసిన ప్ర‌య‌త్నం కాదు. ఎంచుకున్న క‌థ‌ను తీశానంతే. ఈ క‌థ‌లో కొత్త‌గా ఏం చెబుదామ‌నే ఉద్ధేశంతో సినిమాని ప్రారంభించాను అని తెలిపారు. ఈ సినిమా ఎలా వ‌చ్చింది అన్న‌ది  చూసి మీరే చెప్పాలి అని సుజీత్ అన్నారు. 

`సాహో` వీడియో గేమ్ లాంచ్ చేయాల‌నుకోవ‌డానికి కార‌ణం కూడా సుజీత్ తెలిపారు. సాహో మూవీ రిలీజ్ తో పాటు గేమ్ ని రిలీజ్ చేస్తే రెండిటికీ ప్ర‌చారం ద‌క్కుతుంద‌నే ఇలా చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌చారానికి గేమ్ కూడా స‌రైన వేదిక అని అన్నారు. నేడు లాంచ్ చేసిన ఏచోట నువ్వున్నా.. పాట‌ను ఆస్ట్రియాలోని ఖ‌రీదైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు. ఈ పాట‌ను శంక‌ర్ త‌ర‌హాలో తెర‌కెక్కించార‌ని మీడియా ప్ర‌శంసించింది. అయితే త‌న‌ను శంక‌ర్ స్థాయి ద‌ర్శ‌కుల‌తో పోల్చ‌వ‌ద్ద‌ని అన్నారు. వాళ్ల స్థాయి ఎంతో ఎత్తులో ఉంటుంద‌ని విన‌మ్రంగా అంగీక‌రించారు. ఆ ప్ర‌శంస‌కు ఆనందం వ్య‌క్తం చేశారు.