వీవీ వినాయక్‌కు షాక్ ఇచ్చిన తెలంగాణా సర్కార్

ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ నగర శివారులోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని వట్టినాగులపల్లిలో ఆయన నిర్మిస్తోన్న భవంతిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు.

111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్‌ అధికారులు వాటిని కూడా కూల్చివేయనున్నారు.

నిర్మాణ పనులు పూర్తయ్యాక ఆ ఇంట్లోకి వెళ్దామని వినాయక్ భావిస్తున్నారు. కానీ అనుమతి లేకపోవడంతోనే దాన్ని కూల్చామని అధికారులు స్పష్టం చేశారు. వట్టినాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఇక్కడ జీ+2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంది.