సీసీసీ నిధికి 6 కోట్లు.. ఎవ‌రికి పంచారు?

సెల‌బ్రిటీ చారిటీ (సీసీసీ) నిధికి ఇప్ప‌టికే 6కోట్లు పైగా జ‌మ అయ్యింది. అయితే ఈ మొత్తాన్ని 24 శాఖల్లోని కార్మికుల‌కు ఆప‌న్నుల‌కు పంపిణీ చేశారా? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లారిటీ అయితే రాలేదు. దీనిపై అటు కార్మిక సంఘాల వాళ్లు కానీ.. ఇటు చిరంజీవి సార‌థ్యంలోని సీసీసీ కానీ స్ప‌ష్ఠ‌మైన ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌క‌పోవ‌డంతో ఏదీ అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

మ‌రోవైపు కార్మికుల్లో చిన్నా చిత‌కా ఆర్టిస్టులు స‌హా ఇత‌ర శాఖ‌ల్లోని రోజువారీ భ‌త్యంపై బ‌తికేవాళ్లంతా ఒక‌టే టెన్ష‌న్ లో ఉన్నారు. ఇంటి అద్దె స‌హా గ్రాస‌రీస్ కి అయినా నోచుకోని స్థితిలో పిల్లా పాప‌ల‌తో ఎలా కాలం వెల్ల‌దీయాలి? అన్న టెన్ష‌న్ అలుముకుంది. ఒక‌ర‌కంగా చూస్తే అటు చిత్ర‌పురి లాంటి చోట ఎంద‌రో కార్మికులు జీవిస్తున్నారు. కృష్ణాన‌గ‌ర్.. ఫిలింన‌గ‌ర్ ప‌రిస‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి . కానీ వీళ్ల‌లో ఎవ‌రికి ఏం అందుతోందో ఎవ‌రికీ అర్థం కాని స‌న్నివేశం ఉంది. ఇక చిన్న ఆర్టిస్టుల‌తో జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో టీఎంటీఏయు లాంటి సంఘాలు ప‌ని చేస్తున్నాయి. వీళ్ల‌లో ఎవ‌రికి సీసీసీ ఫండ్ ని పంచారు? అన్న‌దానిపైనా స్ప‌ష్ఠ‌త లేదు. ఇక టీఎంటీఏయు (తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టులు) స‌హా ప‌లువురు ఇప్ప‌టికే త‌మ‌కు ఏదీ అంద‌లేద‌న్న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రి దీనిపై సినీపెద్ద‌లు ఏవైనా రివ్యూలు చేసి క్లారిటీ ఇస్తారా? అన్న‌ది చూడాలి. లేదంటే హుద్ హుద్ ఫండ్ (చంద్ర‌బాబు ఎవ‌రికి పంచారో?) ఎటెళ్లిందో తెలీన‌ట్టే ఇది కూడా తెలియ‌కుండా పోతుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.