అల్లుడు శీనుగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఆ తర్వాత వరుసగా డజను సినిమాల్లో నటించేశాడు. బంపర్ హిట్టు అని చెప్పుకునేందుకు ఏదీ లేకపోయినా.. మార్కెట్లో హాట్ కేకులాగే కంటిన్యూ అయ్యాడు. ఎవరీ కుర్రాడు? అంటే .. అతడే బెల్లంకొండ శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిని హృతిక్ రోషన్ అంత పెద్ద స్టార్ ని చేయాలని కలలుగన్నారంటే అతిశయోక్తి కాదు. శీనూని ధూమ్ 2 రేంజు కథలో చూపించాలన్న తపనతో ఆయన ఎన్నో యాక్షన్ స్క్రిప్టుల్ని ఎంపిక చేసి అందులో ప్రయోగాలు చేయించారు. కానీ అవేవీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా దారుణ వైఫల్యాల్ని చవి చూశాయి.
కొన్ని వరుస యాక్షన్ సినిమాల్లో నటించిన శ్రీనూకి హిందీ డబ్బింగ్ మార్కెట్ పెరిగింది. ఆ క్రమంలోనే థ్రిల్లర్ బాట పట్టి పొరుగున హిట్టయిన ఓ సినిమాని రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు. ఈ చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ హిట్టు తర్వాత అదే జోష్ ని కొనసాగిస్తూ.. హైపర్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రం `అల్లుడు అదుర్స్` ప్రారంభించాడు.
దీంతో పాటు స్వామి రారా ఫేం సుధీర్ వర్మ తో మరో చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడన్నది తాజా సమాచారం. ఈసారి కూడా తన పాత పంథానే అనుసరిస్తున్నాడట శీనూ. యాక్షన్ థ్రిల్లర్ కథతో సుధీర్ శ్రీనివాస్ను సంప్రదించాడని, కథ విన్న తర్వాత వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. సుధీర్ గత చిత్రాలు రణరంగం, కేశవ పెద్దగా వర్కవుటవ్వలేదు. కానీ దర్శకుడిగా సరికొత్త ప్రయత్నం చేశాడన్న టాక్ వినిపించింది. అదే అతడిని ముందుకు నడిపిస్తోంది. యాక్షన్ శ్రీనూకి కొత్త కాదు కాబట్టి సుధీర్ అతడిని ఎలా చూపిస్తాడన్నది చూడాలి.