‘బాహుబలి’నిర్మాత అసలు గొడవేంటి, కేసు పెట్టడమేంటి?

ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత శోభు యార్లగడ్డ. ఆయన ఇప్పుడు తమిళ నిర్మాత రాజరాజన్ పై కేసు వేసారు. ఆయన తో శోభుకు వివాదం ఏమిటి..కేసు లు పెట్టుకునేటంత దూరం ఎందుకు వెళ్లిందో చూద్దాం.

వివరాల్లోకి వెళితే..తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి నటించిన సినిమా ‘సింధూబాద్‌’. అంజలి హీరోయిన్. కె ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజరాజన్‌ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా వివాదం కారణంగా ఆగిపోయింది.

‘బాహుబలి’ సినిమాను రాజరాజన్‌ తమిళంలో విడుదల చేశారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తీసిన ఈ సినిమా తమిళనాడులోనూ మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకూ తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాజరాజన్‌ చెల్లించలేదని ‘బాహుబలి’ నిర్మాత శోభూ యార్లగడ్డ కోర్టును ఆశ్రయించారు.

రాజరాజన్‌ నిర్మించిన ‘సింధూబాద్‌’, ‘ఎన్నై నోకి పాయుమ్‌ తోటా’ సినిమాల విడుదలపై కేసు వేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ హైకోర్టు రెండు సినిమాల విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. కానీ రాజరాజన్‌ తన సహ నిర్మాతలు, భాగస్వాములతో కలిసి ‘సింధూబాన్‌’ను విడుదల చేసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే థియేటర్‌ ఓనర్ దీనికి అంగీకరించలేదు. సినిమా విడుదలపై ఎటువంటి అభ్యంతరం లేదని డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ (డీసీపీ) నుంచి సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే స్క్రీనింగ్‌ వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమాపై కోర్టు స్టే విధించిన కారణంగా సర్టిఫికెట్‌ ఇవ్వమని డీసీపీ స్పష్టం చేసింది. ఇప్పుడు కె ప్రొడక్షన్‌ భాగస్వామ్య సంస్థ వైఎస్‌ఆర్‌ ఫిల్మ్స్‌ హైదరాబాద్‌ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సినిమా విడుదలపై స్టే ఎత్తివేయాలని కోరింది.