అన్ని పరిశ్రమల్లోనూ సక్సెస్ రేటు తక్కువగా ఉండే ఏకైక రంగం సినీరంగం. ఇక్కడ యేటేటా వందల సినిమాలు రిలీజవుతున్నా పదుల సంఖ్యలో మాత్రమే సక్సెస్ అవుతుంటాయి. అందుకే 10 శాతం సక్సెస్ రేటును ఫిక్స్ చేశారు. ఇలాంటి రంగంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు ఆలోచిస్తుంటారు. సరదాగా పోగొట్టుకుందామనో లేక ఏదో ఫ్యాషన్ కోసమో లేక బ్లాక్ మనీని వైట్ లోకి మార్చాలనో.. ఇటువైపు వచ్చేవాళ్లే ఇక్కడ ఎక్కువ. గ్లామర్ ప్రపంచంలోకి మోజుతో వచ్చి లాట్లు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. అడుగడుగునా గ్యాంబ్లర్స్ ఎదురయ్యే ప్రమాదకర పరిశ్రమ కూడా ఇదే కావడంతో ఇక్కడకు వచ్చేందుకు క్లీన్ చిట్ ఉన్న వాళ్లు ఎవరూ ఇష్టపడరు. అయితే ఇటీవల ఈ సన్నివేశంలో అంతో ఇంతో మార్పు కనిపిస్తోంది.
పలువురు అత్యున్నత విద్యావంతులు ఈ రంగంలో ప్రవేశిస్తుండడం.. అలాగే పలు రంగాల్లో సత్తా చాటి సినిమా అనే ఫ్యాషన్ తో వస్తున్న వాళ్లు ఉన్నారు. రంగుల మాయా ప్రపంచంలో కొన్ని పాజిటివ్ కారణాల వల్ల ఇటీవల చిన్నపాటి మార్పు సాధ్యమవుతోంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లో టీమిండియా మాజీ రథసారథి ఎం.ఎస్.ధోనీ వినోదరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన స్నేహితుడు జాన్ అబ్రహాంతో కలిసి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించాలని ధోనీ భావిస్తున్నారు. ప్రత్యేకించి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలపై దృష్టి సారించాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ధోనీ ప్రారంభించబోయే సంస్థ టైటిల్ సహా ప్రతిదీ వివరంగా తెలియజేయనున్నారని తెలుస్తోంది. ఎం.ఎస్.దోని బయోపిక్ సంచలన విజయం సాధించడం కూడా ధోనీలో ఈ కొత్త ఆలోచనలకు స్ఫూర్తి అని భావిస్తున్నారు.
క్రికెట్ రంగం నుంచి సినీరంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్లు తక్కువే. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రం స్థిరాస్తి రంగంలో.. భారీగా భూములు కొనడంపై దృష్టి సారించారే కానీ ఏనాడూ సినిమా అన్న ఊసెత్తలేదు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి వస్తోంది అనగానే అక్కడ సచిన్ భారీగా పెట్టుబడులు పెట్టారని, భూములు కొన్నారని ప్రచారమైంది.
