నాని నిర్మాతగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో గత ఏడాది రూపొందిన అ! సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకున్నది. వినూత్నమైన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ను రూపొందించేందుకు దర్శకుడు ప్రశాంత్వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తొలి భాగానికి భిన్నంగా అనేక ఉపకథలతో కాకుండా ఒకే కథతో ఈ సీక్వెల్ను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రశాంత్వర్మ కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. తొలిభాగంలో ప్రధాన పాత్ర పోషించిన కాజల్ అగర్వాల్ సీక్వెల్లోను కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. కాజల్ పాత్ర ప్రయోగాత్మక పంథాలో వినూత్నంగా ఉంటుందని అంటున్నారు. ఆమెతో పాటు తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందించబోతున్నట్లు తెలిసింది.