బోయపాటి 65 కోట్ల సమస్య తీరేనా?

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా తీయబోతున్నానని ఇటీవల ఓ వేదికపై బోయపాటి చెప్పారు.

అయితే ఆ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది..అసలు ఎక్కుతుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లోనూ, సినిమా ప్రేమికుల్లోనూ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో బాలయ్యతో మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేసాడు. ఆ స్టోరీలైన్ బాలయ్యకు కూడా నచ్చిందట.

నవంబర్ నుంచి డేట్స్ ఎలాట్ చేస్తాను అన్నారు. అయితే సమస్య అంతా నిర్మాత దగ్గరే వస్తోందిట. బోయపాటి 65 కోట్లు బడ్జెట్ కోట్ చేస్తున్నాడట. కానీ బోయపాటి సినిమాకు అంత బడ్జెట్ పెట్టే నిర్మాత కనపడటం లేదని సమాచారం. బాలయ్య మొదట ప్రొడ్యూస్ చేద్దామనుకున్నాడు కానీ అంత బడ్జెట్ అనేసరికి ఆయనా వెనకడుగు వేసారట. మరి ఏ నిర్మాత అయినా ముందుకు వస్తే సినిమా పట్టాలు ఎక్కుతుంది. అనీల్ సుంకర, దిల్ రాజు వంటివారు ఉత్సాహం చూపించారు కానీ బడ్జెట్ విని వెనకడుగు వేసారట.

గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి సక్సెస్ సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అనే మార్క్‌ ఏర్పడింది.ఈ సినిమా ఆశించిన విజయం సాధిస్తే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కలయికలో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.