విజయ్ దేవరకొండ, దిల్ రాజు మధ్య క్లాష్

ఇద్దరికీ అదే రోజు పోటీ తప్పదా

దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు కానీ ఇప్పటిదాకా అది సెట్ కాలేదు. కానీ వీళ్లిద్దరు మాత్రం ఒకే రోజు క్లాష్ అవుతున్నారు. అదీ నిర్మాతగా ఇద్దరూ ఒకరికొకరు పోటీపడటం ఆసక్తికరంగా ఉంది. అవును విజయ్ దేవరకొండ నిర్మాతగా రూపొందిన మీకు మాత్రమే చెప్తా, దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఆవిరి చిత్రాలు రెండూ ఒకే రోజు విడుదల అవుతున్నాయి. దాంతో ఈ విషయం ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే సెన్సేషనల్ హీరోగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ టాలెంట్ కి ప్రోత్సాహం అందించేందుకు “మీకు మాత్రమే చెప్తా ” అనే సినిమాతో విజయ దేవరకొండ నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు. అతి తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ కు విక్రయించేసారు. ఆయన నవంబర్ 1 న విడుదల చేస్తున్నారు.

ఇక గత కొంతకాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న డైరెక్టర్ రవిబాబు మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పంది పిల్లతో తీసిన అదుగో సినిమా బోల్తా కొట్టడంతో ఆయన తనకు ఎంతగానో కలిసి వచ్చిన హారర్ సినిమాలనే నమ్ముకున్నాడు. ఆవిరి అనే పేరుతో కొత్త సినిమా రెడి చేశారు. కొద్ది రోజులు క్రితం ఆ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. నవంబర్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దిల్ రాజు రిలీజ్ చేస్తున్న సినిమా కాబట్టి మంచి రిలీజ్ ఉంటుంది. పబ్లిసిటీ కి అయితే ఎటు వంటి ఢోకా ఉండదు. అయితే ఆవిరికి విజయ్ దేవరకొండ నిర్మాతగా చేస్తున్న మొదటి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’ తో ఆరోజున పోటీ పడబోతోంది.