వాల్మీకిని మెచ్చుకున్న మహేష్, కారణం అదా?

మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుందా ఇప్పుడు?

తెలుగులో ఫ్యాన్స్ హంగామా ఎక్కువ. తమ హీరో ఏ విషయాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఫ్యాన్స్ అదే మాట్లాడతారు. ఫలానా సినిమా బాగుందని ఏదైనా హీరో చెప్తే..వెంటనే ఫ్యాన్స్ ఆ సినిమాని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపుతుంది. తాజాగా మహేష్ బాబు ..వాల్మీకి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ పోస్ట్ లు పెట్టడం కనపడుతోంది.

వివరాల్లోకి వెళితే… మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్‌’. పూజా హెగ్డే స్పెషల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలై మొదటి షో నుండే పాజిటివ్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తోంది. బయ్యర్లకి రికవరీ రాబట్టే దిశగా దూసుకెళ్తున్న ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు.

‘గద్దలకొండ గణేష్’ చూస్తూ బాగా ఎంజాయ్ చేశానని, వరుణ్ తేజ్ గణేష్‌గా అద్భుతంగా నటించాడని, హరీష్ శంకర్, 14 రీల్స్ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని, అలాగే మంచి సక్సెస్‌ను అందుకున్న చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు..’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్‌కి హీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు రామ్, గోపి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఇదే బ్యానర్ లో మహేష్ బాబు వరసగా ఆగడు, దూకుడు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాని సైతం చేస్తున్నారు.