రానా `విరాట‌ప‌ర్వం` ప‌రిస్థితేంటి?

రానా `విరాట‌ప‌ర్వం` ప‌రిస్థితేంటి?

ఉత్త‌ర తెలంగాణ‌లో 90వ ద‌శ‌కంలో న‌క్స‌ల్స్ మూవ్‌మెంట్ చాలా ఎక్కువ‌గా వుండేది. ఆ స‌మ‌యంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరికి చెందిన‌ బెల్లి ల‌లితని నయీం ముఠా అత్యంత కిరాత‌కంగా హ‌త్య చేసింది. 90వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన న‌క్స‌ల్ ఉద్య‌మం స‌మ‌యంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యం‌లో వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్నారు.

నందితా దాస్ మాన‌వ హ‌క్కుల నేత‌గా క‌నిపించ‌బోతోంది. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం కొత్త స‌మ‌స్య‌ని ఎదుర్కొంటోంది. రానా లేకుండా సాయి ప‌ల్ల‌వికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన వేణు ఊడుగుల ఆ త‌రువాత రానా తో షూటింగ్ అనుకున్న స‌మ‌యంలో అనారోగ్య కార‌ణంగా అమెరికా వెళ్లిపోయాడు. తిరిగి వ‌చ్చాక షూటింగ్‌ని స్పీడ‌ప్ చేయాల‌ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల ప్లాన్ మొత్తం మారిపోయింది. రానా స‌హ‌క‌రించినా వాతావ‌ర‌ణం క‌రోనా రూపంలో అడ్డుత‌గ‌ల‌డంతో చిత్ర బృందం కొత్త ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమా షెడ్యూల్ కార‌ణంగా సాయి ప‌ల్ల‌వి, రానాల‌ మిగ‌తా సినిమాల‌కు ఎఫెక్ట్ ప‌డేలా వుంద‌ని, `ఆర్ ఆర్ ఆర్‌` త‌ర‌హాలో ఈ చిత్రం అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఇప్ప‌టికే శ‌ర్వానంద్‌తో చేసిన `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` చిత్రంతో సుధాక‌ర్ చెరుకూరి చాలా న‌ష్ట‌పోయారు. అలాంటి నిర్మాత‌కు మ‌ళ్లీ తాజా ప‌రిస్థితులు మ‌రో స‌మ‌స్య‌ని తెచ్చిపెట్టాయ‌ని. దీని నుంచి ఆయ‌న ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.