మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ చూపించ‌బోతున్నార‌ట‌. సినిమాలో చిరు ఎండోమెంట్ అధికారిగా, ప్ర‌జా నాట్య‌మండ‌లి కార్య‌క‌ర్త‌గా క‌నిపిస్తార‌ని ఇటీవ‌ల లీకైన ఫొటోల‌తో స్ప‌ష్టమైంది.

గ‌త కొన్ని రోజులుగా కోకా పేట్‌లో వేసిన కాల‌నీ సెట్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇక్క‌డే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల్ని షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మ‌రో కీల‌క అతిథి పాత్ర ఎంట్రీ వుంటుంద‌ట‌. ఈ పాత్ర న‌క్స‌లైట్ పాత్ర అని, దాని నిడివి సినిమాలో 30 నిమిషాల‌కు పైనే వుంటుంద‌ని, ఈ పాత్ర‌ని ముందు రామ్‌చ‌ర‌ణ్‌తో చేయించాల‌ని అనుకున్నార‌ట‌. అయితే రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌లో బిజీగా వుండ‌టం వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌టం లేద‌ని, ఆ స్థానంలో మ‌హేష్‌ని తీసుకోవాల‌ని కొర‌టాల భావించార‌ట‌. ఈ విష‌యం తెలిసి మ‌హేష్‌ని రామ్‌చణ్ సంప్ర‌దించార‌ట‌.

ద‌ర్శ‌కుడు కొర‌టాల‌తో పాటు చిరుపై వున్న అభిమానంతో మ‌హేష్ ఈ చిత్రంలోని అతిథి పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మిగ‌తా ఫార్మాలిటీస్‌ని టీమ్ పూర్తి చేస్తోంద‌ని, ఈ సినిమా కోసం మ‌హేష్ 30 రోజులు డేట్స్ కూడా కేటాయించాడ‌ని యూనిట్ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఊపందుకుంది. దీనిపై మ‌రింత క్లారిటీ రావాలంటే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ కావాల్సిందే.