మ‌నోజ్ నుంచి బ్రేకింగ్ వ‌చ్చేసింది!

మంచు మ‌నోజ్ చెప్పిన‌ట్టుగానే గురువారం ఉద‌యం బ్రేకింగ్ న్యూస్‌తో వ‌చ్చేశాడు. గ‌త మూడేళ్లుగా సినిమాల‌కు దూర‌మైన ఆయ‌న మాన‌సికంగా కొంత ఇబ్బందుల‌కు గురికావ‌డంతో సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం `ఒక్క‌డు మిగిలాడు` అజ‌య్ ఆండ్రూస్‌ని న‌మ్మి చేసిన ఈ చిత్రం ఫ‌లితం విష‌యంలో తీవ్ర మ‌న‌స్తాపాన్ని క‌లిగించింద‌ట‌. దీంతో ఇటు సినిమాలు, అటు వ్య‌క్తిగ‌త జీవితం మాన‌సికంగా కృంగ‌దీయ‌డంతో మ‌నోజ్ జీవితం ఆందోళ‌న క‌రంగా త‌యారైంది. దీంతో కొంత కాలం సినిమాల‌కు దూరంగా వుండాల‌ని భావించారు.

అయితే ఇటీవ‌ల త‌న భార్య ప్ర‌ణ‌తి రెడ్డికి విడాకులు ఇచ్చిన త‌రువాత ఫ్రీబ‌ర్డ్‌గా మారిపోయాడు మంచు మ‌నోజ్‌. ఈ సంద‌ర్భంగానే `త్వ‌ర‌లో తాను ఫైర్ బాల్‌గా వెల‌గ‌బోతున్నాన‌ని, ఓ అప్‌డేట్‌తో మీ ముందుకు వ‌స్తాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు. అన్న‌ట్టుగానే బ్రేకింగ్ న్యూస్‌తో రావ‌డం ఆక‌ట్టుకుంటోంది. మంచు మ‌నోజ్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై త‌ల్లి నిర్మాలాదేవితో క‌లి మ‌నోజ్ కొత్త చిత్రాన్ని నిర్మిస్తూ న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి `అహం బ్ర‌హ్మ‌స్మి` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. గురువారం టైటిల్ ఫ‌స్గ్‌లుక్ పోస్ట‌ర్‌ని మ‌నోజ్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశాడు.

విభిన్న‌మైన నేప‌థ్యంలో రాబోతున్న ఈ సినిమా ద్వారా శ్రీ‌కాంత్ ఎన్‌. రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మార్చి 6న భారీగా ఈ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు. మ‌రి ఈ సినిమాతో అయినా మ‌నోజ్ హిట్ బాట ప‌డ‌తాడో చూడాలి.