మహేష్ మళ్లీ అదే స్టోరీ లైన్ తోనే…’సరిలేరు నీకెవ్వరు’?

‘సరిలేరు నీకెవ్వరు’కథ కు ఆ సినిమాకు పోలిక?

ఈ మధ్యకాలంలో సినిమా ప్రారంభం రోజే ….ఈ సినిమా కథ ఫలానా చోట నుంచి లేపేసారు అంటూ వార్తలు రావటం మొదలవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇదో పెద్ద సమస్యగా మారింది. అయితే ఒక్కోసారి ఆ వార్తల్లో నిజం ఉందని తేలుతోంది కూడా. తాజాగా మహేష్ కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరుకు కూడా అలాంటి పరిస్దితే నెలకొంది.

వరుస హిట్స్ తో సూపర్‌ ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు టైటిల్ తో ఈ సినిమాను ప్రారంభించాడు మహేష్‌. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతన్న ఈ సమయంలో అప్పుడే ఈ సినిమా కథ ..మహేష్ గతంలో చేసిన అతడు సినిమాకు దగ్గరగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

అప్పట్లో వెంకటేష్ నటించిన ‘వారసుడొచ్చాడు’, మహేష్ ‘అతడు’ నుంచి ఈ సినిమా కథ తయారు చేసాడంటున్నారు. ఆ రెండు సినిమాల్లోలాగానే ఈ సినిమాలో హీరో కూడా తనతో కలిసి ఆర్మీలో పని చేసే ఓ స్నేహితుడు (సత్యదేవ్)ఇంటికి వెళ్లాల్సిన అవసరం పడుతుందిట. ఆ స్నేహితుడు చనిపోయాడనే వార్త చెప్తామని అనుకుంటాడట.

అయితే ఆ కుటుంబంలో కొన్ని భాధ్యతలు ఉండటంతో … అక్కడే కొంతకాలం ఉండిపోవాల్సి వస్తుందిట. దాంతో ఆ క్రమంలో తన స్నేహితుడు ఫ్యామిలీకి, ఊరుకి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. పూర్తి ఫన్ తో ఆ రెండు సినిమాలకు సంభంధం లేకుండా సాగుతుందిట.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.