ప‌వ‌న్‌కు ఏ.ఎం.ర‌త్నం చుక్క‌లు చూపించాడా?

సినిమా ఇండ‌స్ట్రీ ఇదొక రంగుల ప్ర‌పంచం. ఎవ‌రి రంగు (ఫేట్‌) ఎప్పుడు ఎలా మారుతుందో ఇక్క‌డ చెప్ప‌డం క‌ష్టం. రాత్రికి రాత్రి కోటీశ్వ‌రులు అయిన వాళ్లున్నారు. అదే రాత్రి ఉన్న‌దంతా ఊడ్చుకెళ్లిపోయి రోడ్డున ప‌డ్డ వాళ్లూ వున్నారు. స్టార్‌లు అయిన వాళ్లూ వున్నారు. సినిమాలు లేక‌, అవ‌కాశాలు రాక బికార్లు అయిన వాళ్లూ వున్నారు. ఒక‌ప్పుడు స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ వెలుగు వెలిగిన నిర్మాత ఏ.ఎం. క‌త్నం. విజ‌య‌శాంతి మేక‌ప్‌మెన్‌గా మొద‌లైన ఆయ‌న ప్ర‌స్థానం కోట్ల‌ల్లో సినిమాలు నిర్మించే దాకా వెళ్లి ఉన్న‌ట్టుంది కింద ప‌డిపోయింది.

దీంతో మ‌ళ్లీ కోలుకోవ‌డానికి త‌మిళ హీరో అజిత్ సాయం తీసుకుని కాస్త కుదుట‌ప‌డ్డారు. తెలుగులో వున్న స్టార్ హీరోల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఏ.ఎం. ర‌త్నంకు ప్ర‌త్యేక అనుబంధం వుంది. ప‌వ‌న్‌తో ఆయ‌న `ఖుషీ`, బంగారం వంటి చిత్రాల్ని నిర్మించారు. కొంత విరామం త‌రువాత ప‌వ‌న్‌తో ఓ సినిమాని ప్రారంభించారు. త‌మిళ చిత్రం `జిల్లా` ఫేమ్ నేస‌న్ ద‌ర్శ‌కుడు. పూజా కార్య‌క్ర‌మాల ద‌శ‌లోనే ఈ సినిమా ఆగిపోయింది. దీని కోసం ప‌వ‌న్ తీసుకున్న మొత్తం 18 కోట్లు. ఇప్ప‌టికీ తిరిగి ఇవ్వ‌లేదు. అత‌నికి సినిమా చేయ‌లేదు.

గ‌త కొంత కాలంగా త‌న డ‌బ్బులు తిరిగి ఇమ్మ‌ని లేదా సినిమా చేసిపెట్ట‌మ‌ని ఏ.ఎం. ర‌త్నం ప్ర‌తీ వారం చెన్నై నుంచి హైద‌రాబాద్ రావ‌డం.. ప‌వ‌న్ ఇంటికి వెళ్ల‌డం.. ప‌వ‌న్ చూద్దాం.. చేద్దాం అని తిరిగి పంపించేయ‌డం ఇలా చాలా కాలంగా జ‌రుగుతూ వ‌స్తోంద‌ట‌. ఒక రోజు ఓపిక న‌శించిన ఏ.ఎం.ర‌త్నం సినిమానా, డ‌బ్బులా అని గ‌ట్టిగా నిల‌దీసినంత‌ప‌ని చేయ‌డంతో చేసేది లేక ప‌వ‌న్ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఈ చిత్రానికి క్రిష్ దర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో దీన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. చార్మినార్‌, తాజ్ మ‌హ‌ల్ సెట్‌లని సినిమా కోసం నిర్మిస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా ప‌వ‌న్‌కు ర‌త్నం చుక్క‌లు చూపించాడా? అని అవాక్క‌వుతున్నార‌ట‌.