నీ మూలంగా ఒక్క నిర్మాత అయినా బాగుపడ్డాడా?

వివాదంలో ఇరుక్కున్న ధనుష్

‘నిర్మాతల నుంచి రెమ్యునేషన్స్ వసూళు చేసుకోవటం ఎంతో కష్టంగా మారింది. కేవలం రెమ్యూనరేషన్‌ వసూళు చేసుకునేందుకు ఇతర పనులు వదులుకోవాల్సి వస్తుంది’అంటూ రీసెంట్ గా ధనుష్‌ కామెంట్ చేసారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయిఈ కామెంట్స్ పై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌, అజిత్‌ లాంటి టాప్‌ స్టార్లు కూడా ఇలాంటి ఆరోపణలు చేయటం లేదంటున్నారు. ధనుష్‌ నిర్మాతలకు పూర్తి స్థాయిలో సహకరించకపోవటం కారణంగానే నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ధనుష్‌ మానుకోవాలని సూచించారు. అంతేకాదు ధనుష్ సినిమాలతో నిర్మాతలకు లాభాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువన్నారు.

ప్రారంభంలో ఆయన హీరోగా నటించిన ‘తుల్లువదో ఇళమై’ నుంచి ఇప్పటి వరకు అనేక చిత్రాలతో నిర్మాతలు వరుసగా నష్టపోతున్నారన్నారు. ధనుష్‌తో సినిమా తీసిన నిర్మాతలు లాభాలు ఆర్జించిన దాఖలాలు లేవన్నారు. వారిలో చాలా మంది సినీరంగానికే దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాత కె.రాజన్‌ మాట్లాడుతూ ధనుష్‌తో చిత్రం తీసిన నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోయ్యారని, హీరో , దర్శకులు చేసే పొరపాట్లతో చిత్రాన్ని నిర్మించడంలో జాప్యం జరుగుతోందని, ఫలితంగా నిర్మాతల అప్పులు పెరిగిపోతున్నాయన్నారు.

రూ.10 కోట్లు పెట్టి తీసిన చిత్రం రూ.8 కోట్లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందన్నారు. దీంతో అనేకమంది నిర్మాతలు ఆస్తులు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. ఇదే తరహాలో మరికొందరు నిర్మాతలు ధనుష్‌పై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా నిర్మాతల వ్యాఖ్యలను ఖండిస్తూ ధనుష్‌ అభిమానులు సామాజిక మాధ్యమాలలో హాష్‌ ట్యాగ్‌ విడుదల చేశారు.