నా కెరీర్‌లో తీసుకున్నఉత్త‌మ నిర్ణ‌యం ఇదే!

మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌, మ‌హేష్ యాక్ష‌న్‌, నిర్మాత‌ల రాజీప‌డ‌ని మేకింగ్‌, 13 ఏళ్ల త‌రువాత రాముల‌మ్మ విజ‌య‌శాంతి రీ ఎంట్రీ, దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌ర్పిస్తున్న‌ వీర జ‌వాన్ల త్యాగం.. వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో భారీ స్థాయిలో తెర‌పైకొచ్చిన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా వంద కోట్ల‌ని దాటిపోయింద‌ని మేక‌ర్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు శుక్ర‌వారం సాయంత్రం హ‌న్మ‌కొండ‌లో `బ్లాక్‌బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్`ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేష్‌, విజ‌య‌శాంతి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, అనిల్ రావిపూడి, ర‌ష్మిక మంద‌న్న‌, దేవి శ్రీ‌ప్ర‌సాద్, నిర్మాత‌లు దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సినిమా స‌క్సెస్ ఆనందంలో వున్న హీరో మ‌హేష్ త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. త‌న కెరీర్‌లో తీసుకున్న ఉత్త‌మ నిర్ణ‌యం ఈ సినిమా అంగీక‌రించ‌మే అని వెల్ల‌డించిన మ‌హేష్ ఒకే ర‌క‌మైన సినిమాలు చేస్తున్నాన‌ని ఫ్యాన్స్ నుంచి ఎప్పటిక‌ప్పుడు ఫీడ్ బ్యాక్ వ‌స్తోంద‌ని, క‌థ‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం వ‌ల్లే అలా జ‌రిగింద‌ని,ఈ సారి ఫ్యాన్స్‌ని మెప్పించే సినిమా చేయాల‌నే `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంగీక‌రించాన‌ని చెప్పుకొచ్చారు.