నాగ‌శౌర్య సినిమాపై అది పుకారేన‌ట‌!

నాగ‌శౌర్య హీరోగా శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఇటీవ‌ల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కొంత భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే తాజాగా నాగ‌శౌర్య న‌టించిన `అశ్వ‌థ్థామ‌` యావ‌రేజ్‌గా నిల‌వ‌డంతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌క్కాగా ప్లాన్ చేసుకోవాలని, ఆ సినిమాతో ఖ‌చ్చితంగా హిట్‌ని సొంతం చేసుకోవాల‌ని నాగ‌శౌర్య ప్లాన్ చేశాడ‌ని. ఆ కార‌ణంగానే అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌తో చేస్తున్న చిత్రాన్ని మ‌ధ్య‌లోనే ఆపేశాడ‌ని ఇటీవ‌ల వరుస క‌థ‌నాలు వినిపించాయి.

దీనిపై ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సీరియ‌స్‌గా స్పందించింది. నాగ‌శౌర్య‌తో తాము నిర్మిస్తున్న సినిమా ఆగిపోతేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని, సినిమా సంతృప్తిక‌రంగా వ‌స్తోంద‌ని. మిగ‌తా భాగాన్ని యూఎస్‌లో ప్లాన్ చేశామ‌ని, అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్‌కు అనుమ‌తులు ఇంకా ల‌భించ‌లేద‌ని వెల్ల‌డించింది. ఆ కార‌ణంగా నాగ‌శౌర్య – అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌ల కాంబినేష‌న్‌లో నిర్మిస్తున్న సినిమా ఆల‌స్యం అవుతూ వ‌స్తోందే కానీ సినిమా ఆగిపోలేద‌ని, ఈ సినిమా ఆగిపోయిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని మండిప‌డింది.