చిరంజీవి చిత్రానికి మ‌రో షాక్‌!

కొన్ని సినిమాలు ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు పూర్తి చేశారో ఎవ‌రికీ తెలియ‌దు. అంత సైలేంట్‌గా పూర్తియిపోతుంటాయి. కానీ కొన్ని మాత్రం నిత్యం ఏదో ఒక వివాదంతో ప్రారంభం నుంచి వార్త‌ల్లో నిలుస్తుంటాయి. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 152 చిత్రం ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటోంది. ఈ సినిమా ప్రారంభించిన ముహూర్తం బాగా లేన‌ట్టుంది. షూటింగ్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఏదో ఒక స‌మ‌స్య ఈ చిత్రాన్ని వెంటాడుతూనే వుంది.

మొద‌టి కెమెరామెన్‌ని మార్చ‌డం వంటి కార‌ణాల‌తో వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం ఆ త‌రువాత కార‌వ్యాన్‌ల కార‌ణంగా వార్త‌ల్లో నిలిచింది. దీనిపై స్వ‌యంగా చిరంజీవి ఓ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లో మాట్లాడాల్సి వ‌చ్చిందంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత త‌క్కువ రోజుల్లోనే సినిమాని పూర్తి చేయాలంటూ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు కండీష‌న్ పెట్ట‌డం ద‌ర్శ‌కుడిలో అసహ‌నాన్ని క‌లిగించింది.

ఇదిలా వుంటే హీరోయిన్ త్రిష ఈ సినిమా నుంచి త‌ప్ప‌కుంటున్నాన‌ని, త‌న‌తో ముందు అగ్రిమెంట్ చేసుకున్న దానికి ఆ త‌రువాత చెబుతున్న‌దానికి ఎలాంటి పోలిక లేద‌ని అందుకే ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్‌మీడియా వేదిక‌గా త్రిష వెల్ల‌డించి సినిమా నుంచి త‌ప్పుకోవ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. కీల‌క‌మైన అతిథి పాత్ర‌లో ముందు రామ్‌చ‌ర‌ణ్ అని ఆ త‌రువాత మ‌హేష్ అని ఇప్పుడు ఫైన‌ల్‌గా రామ్‌చ‌ణ్ అని ర‌క‌ర‌కాల వార్త‌లు కూడా ఈ సినిమాపై ప‌లు ఊహాగానాల‌కు తావిచ్చింది.

తాజాగా ఈ సినిమా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ సినిమా టీమ్‌కి జాతీయ అవార్డు గ్ర‌హీత ప్ర‌ముఖ ఎడిట‌ర్ శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ షాకిచ్చారు. ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారని తెలిసింది. ముందు అనుకున్న స‌మ‌యానికి సినిమా ఆల‌స్యం అవుతుండ‌టంతో ఆస‌హ‌నానికి గురైన శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలిసింది. దీంతో చేసేది లేక ఆయ‌న స్థానంలో న‌వీన్ నూలిని ఎడిట‌ర్‌గా ఫైన‌ల్ చేసుకున్న‌ట్టు ఇన్‌సైడ్‌ టాక్‌..