ఇక ఇప్పుడు కరణం మల్లేశ్వరి బయోపిక్ రెడీ

తెలుగులో బయోపిక్ ల హంగామా మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌పైకొచ్చిన `మ‌హాన‌టి`తో మొద‌లైంది. ఆ త‌రువాత బాల‌య్య చేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్నా టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర సాగుతూనే వుంది. అయితే ఇందులో కొన్ని తెర‌పైకెక్కే ప్ర‌య‌త్నాల్లో వుంటే మ‌రి కొన్ని మాత్రం ప్ర‌క‌ట‌న వ‌చ్చి ఏళ్లు గ‌డుస్తున్నా ముందుకు సాగ‌డం లేదు.

అందులో బ్యాడ్మింట‌న్ స్టార్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ ఒక‌టి. బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోపీచంద్ బ‌యోపిక్ తీస్తామ‌ని ప్ర‌క‌టించింది. సుధీర్‌బాబు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తార‌ని, ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతో టాక్స్ ద‌శ‌లోనే ఆగిపోయింది. తాజాగా మ‌రో క్రీడాకారిణి జీవిత క‌థ తెర‌పైకి రాబోతోంది. ఓలిపిక్స్‌లో హెవీ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మ‌న దేశానికి ప‌తాకాన్ని అందించిన క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి జీవిత క‌థ‌ని తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి కానీ ఇంత వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌క‌టించ‌లేదు.

తాజాగా క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి బ‌యోపిక్‌ని కోన వెంక‌ట్ నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంద‌ని తెలిసింది. అయితే మ‌ల్లేశ్వ‌రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది.