కుల వివాదంలో లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి అనవసరంగా ట్వీటిందే

తనకు సంభందం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో ఈపాటికి సినీ నటి లావణ్య త్రిపాఠికి తెలిసొచ్చి ఉంటుందంటున్నారు నెట్ జన్లు. తన సినిమాలేదో తాను చూసుకోక అనవసరంగా రాజకీయ విషయాల్లో వేలు పెట్టి వివాదం కొనితెచ్చుకుంది లావణ్య.

అసలేం జరిగిందంటే… రీసెంట్ గా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా రాజస్థాన్‌లోని కోటా ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ్ మహా సభను ఏర్పాటుచేస్తే వెళ్లారు. అక్కడ నుంచి వచ్చాక ఆయన ఆ ఫొటోలను ట్వీట్ చేస్తూ..సమాజంలో బ్రాహ్మణులకు గొప్ప స్థానం ఉందని చెప్పారు. ఇది పరుశురాముడి త్యాగం, తపస్సు కారణంగా ప్రాప్తించిందని తెలిపారు. ఈ కారణం వల్లే సమాజానికి మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను బ్రాహ్మణులు పోషిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. సర్లే అదంతా రాజకీయం, కుల వివాదం..అందరూ లైట్ తీసుకుంటారు.

కానీ సినీ నటి లావణ్య త్రిపాఠి కూడా ఓం ప్రకాశ్ బిర్లా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేసింది. తాను కూడా బ్రాహ్మణ యువతినేనని చెప్తూ… లావణ్య… కొందరు బ్రాహ్మణులకు మాత్రమే తాము గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదని చెప్పింది. నువ్వు చేసే పనులను బట్టే నువ్వు గొప్పవాడివి అవుతావని… కులం వల్ల కాదని అంది. ఆ తర్వాత తన ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే ఆ డిలేట్ చేయటం వెనక ఏం జరిగి ఉంటుందని అందరికీ అర్దమయ్యే ఉంటుంది.