ఓటీటీలోకి మరో టాలీవుడ్ చిత్రం 47 డేస్

ఓటీటీలోకి మరో టాలీవుడ్ చిత్రం వచ్చి చేరింది.  థియేట్రికల్ రిలీజ్  లేకుండా నేరుగా ఈ మార్గాన్నిఎంచుకుంది. ఈ కోవలో మొట్టమొదటి తెలుగు సినిమాగా అమృతరామమ్ నిలిచింది. జీ5 యాప్ లో దీన్ని స్ట్రీమింగ్ కు పెట్టారు.

ఇప్పుడు ఇదే యాప్ లో మరో తెలుగు సినిమా ప్రత్యక్షం కాబోతోంది. దీని పేరు 47 డేస్. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సస్పెన్స్-థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే జీ5  అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ డీల్ పూర్తయింది. నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడిన మూవీ కాదు. గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ పూర్తయింది. అదే ఏడాది ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయడానికి బయ్యర్లు ఎవ్వరూ ముందుకురాలేదు.

ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్ చేద్దామని సురేష్ బాబును సంప్రదించారు మేకర్స్. సురేష్ బాబు కూడా రిలీజ్ కు ఓకే చెప్పారు. అంతలోనే లాక్ డౌన్ పడింది. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య థియేటర్లలో రిలీజ్ చేయకుండానే ఇలా ఓటీటీకి ఇచ్చేశారు.