ఈసారి కౌగిలించుకుంటే చెబుతాడ‌ట‌!

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?. ఒక ద‌శ‌లో నిప్పు – ఉప్పులా వున్న ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలంగా ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం మొద‌లైంది. ఒక‌రంటే ఒక‌రు ప్రేమ‌ని కురిపించుకుంటున్నారు. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాకు దూరంగా వుంటూ వ‌స్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఉగాది రోజు ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

చిరు ఎంట్రీ ఇవ్వ‌డంతో సెలబ్రిటీలు, అభిమానులు చిరుకు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. అయితే క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు కూడా స్పందించాడు. `మిత్ర‌మా వెల్క‌మ్ ` అంటూ పోస్ట్ పెట్టాడు. దీనికి చిరు వెరైటీగా స్పందించాడు. `రాన‌నుకున్నావా.. రాలేన‌ను కున్నావా.. అని `ఇంద్ర` చిత్రంలోని డైలాగ్‌తో స‌మాధానం ఇచ్చాడు. దీనికి మోహ‌న్‌బాబు నుంచి కూడా అదే త‌ర‌హా కౌంట‌ర్ రాలేదు కానీ కొంటె స‌మాధానం వ‌చ్చింది. `ఈసారి కౌగిలించుకున్న‌ప్పుడు చెబుతా..`అంటూ మోహ‌న్‌బాబు స‌మాధానం చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది.