ఆ ఇద్ద‌రికి చిరు ఛాలెంజ్‌.. నిజంగా పాటిస్తారా?

`బి ద రియ‌ల్ మెన్‌` దీన్ని పాటించ‌క‌పోతే ఏదో ఉప‌ద్ర‌వం వ‌చ్చిప‌డుతుందేమో అన్నంత సీరియ‌స్‌గా సాగుతోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా జోరుగా సాగుతోంది. సందీప్ వంగ మొద‌లుపెట్టిన ఈ ఛాలెంజ్‌పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా సెల‌బ్రిటీలు మాత్రం కంటిన్యూ చేస్తూనే వున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వంతు వ‌చ్చింది.

చిరుని, బాల‌య్య‌ని, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌ని ఎన్టీఆర్ నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం చిరు త‌న టాస్క్‌ని కంప్లీట్ చేశారు. వాక్యూమ్ క్లీన‌ర్‌తో ఫ్లోర్‌లోని కార్పెట్‌ల‌ని క్లీన్ చేసిన చిరు ఆ ప‌ని పూర్త‌యిపోవ‌డంతో వెంట‌నే కిచ‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. త‌న తల్లి కోసం చెఫ్‌గా మారిపోయారు. ఉప్మా పెస‌ర‌ట్టు వేశారు. దాన్ని గాళ్లో రెండు సార్లు ప‌ల్టీలు కూడా కొట్టించారు. వేడి వేడి ఉప్మా పెస‌ర‌ట్టుని త‌న త‌ల్లి అంజ‌నా దేవికి తినిపించారు.

దీంతో త‌న టాస్క్ పూర్త‌యిపోవ‌డంతో వీడియోని షేర్ చేసిన చిరు ఎన్టీఆర్‌ని ఉద్దేశిస్తూ `భీమ్ ఇవి నేను రోజూ చేసే ప‌నులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్షం ` అంటూ ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్ కోసం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని, త‌న మిత్రుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ని నామినేట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో నిత్యం బిజీగా వుండే కేటీఆర్ ఈ ఛాలెంజ్‌ని పాటిస్తారా? లేక లైట్ తీసుకుంటారా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇక ర‌జినీ వీడియో చేస్తారా? చేస్తే అది ఎలా వుంటుంది.. ఇంటి ప‌నుల్లో త‌లైవా స్టైల్‌ని చూపిస్తాడా? అని అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.