అబ్బబ్బే..ఆ ప్లాఫ్ కు మహేష్ ని విమర్శించలేం

మళ్లీ ‘బ్రహ్మోత్సవం’ టాపిక్ తెచ్చారేంటి

విజయం వస్తే అది తన తెలివే అని, ఫ్లాప్ అయితే అందుకు వేరేవాళ్లు కారణమంటూ వాళ్లమీద తోసేయడం సినీ ఫీల్డ్ లో అతి సహజం. కానీ, కొందరు అలా కాదు. హిట్, ఫ్లాప్ లకు పొంగిపోరు. క్రుంగిపోరు. సినిమా ఫ్లాప్ అయితే, అందుకు వేరే వాళ్ల తప్పు లేదని, కారణం తనే అని తమ నెత్తిన వేసుకునేవాళ్లున్నారు. ఫ్లాప్ ను యాక్సెప్ట్ చేయడానికి గట్స్ ఉండాలి. తన సినిమా ఫ్లాప్ కు హీరోను తప్పు పట్టవద్దని ఓ నిర్మాత కోరాడు. ఆయనే పీవీపి నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి.

‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి ప్రస్తావిస్తూ.. ‘ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పంపిణీ దారులకు తిరిగి డబ్బులు వెనక్కి ఇచ్చాం. ఈ సినిమా వైఫల్యానికి హీరో మహేశ్‌బాబును విమర్శించలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దర్శకుల హీరో. అవసరమైతే ఒక సీన్‌ను పది సార్లు చేస్తుంటారు. ఓ సినిమా ఎప్పుడూ దర్శకులపై ఆధారపడి ఉంటుంది. దర్శకుడు అందరితో కలిసి పనిచేస్తే అవుట్‌పుట్‌ ఇంకా బాగా వస్తుంది. నిర్మాతలు రూ. కోట్లు పెడుతుంటే.. కొందరు దర్శకులు స్క్రిప్టు పూర్తి కాకుండానే సెట్స్‌పైకి వెళ్తుంటారు’ అని చెప్పారు. అంటే దర్శకుడుని తప్పు పట్టినట్టారన్నమాట.

అలాగే స్క్రిప్టును పూర్తిస్థాయిలో సిద్ధం చేయకుండానే సెట్స్‌పైకి వచ్చే దర్శకులు ఉన్నారని నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి అన్నారు. ఆయన ఇటీవల ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ‘నిర్మాతలు సెట్‌కు రాకూడదనేది దక్షిణాదిలోని ఇద్దరు ప్రముఖ దర్శకుల షరతు. నేను వాళ్ల పేర్లు చెప్పను. వారు మన పక్క రాష్ట్రాల్లో ఉన్నారు. దర్శకులకు డిమాండ్‌ ఉంది. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు వారి వళ్లే సాధ్యం అవుతాయి. వారిని విమర్శించలేం. నిర్మాతలకు మరోదారి లేదు’ అని ఆయన చెప్పారు.