అందాల తార శ్రీదేవి ది సహజ మరణం కాదు

అలనాటి అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాదికి పైనే అయ్యింది. గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో శ్రీదేవి ఓ బాత్‌టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మృతి చుట్టూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కానీ వాటికి సరైన సమాధానం మాత్రం లభించలేదు. కేరళ జైళ్ల శాఖ డీజీపీగా పని చేస్తున్న రిషిరాజ్‌ సింగ్‌ ఈ చర్చను తెరమీదకు తీసుకొచ్చారు. కేరళ కౌమిది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషిరాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని బాంబు పేల్చారు. తన స్నేహితుడు, ఫొరెన్సిక్ నిపుణుడు డాక్టర్ ఉమదత్తన్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి దేశవ్యాప్తంగా శ్రీదేవి మృతి గురించి చర్చనీయాంశమైంది. శ్రీదేవి మరణం గురించి తాను ఉమదత్తన్‌తో మాట్లాడినప్పుడు ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేసినట్లు రిషిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.