Captain Miller Movie Review : ‘కెప్టెన్ మిల్లర్’ అభిమానులకు మాత్రమే…!

(చిత్రం : ‘కెప్టెన్ మిల్లర్’, విడుదల తేదీ : జనవరి 26, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు: ధనుష్, శివ రాజ్‌కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, ఎలాంగో కుమారవేల్, కాళి వెంకట్, బోస్ వెంకట్ తదితరులు. దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్, నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీత దర్శకులు: జి.వి. ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: నాగూరన్ రామచంద్రన్)

దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ , ప్రియాంక అరుల్ మోహన్ హీరో, హీరోయిన్ లుగా రూపొందిన సినిమా “కెప్టెన్ మిల్లర్”. ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం వారిని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

కథ : సినిమా కథ భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న నేపథ్యంలో సాగుతుంది. అగ్ని (ధ‌నుష్‌) తక్కువ కులానికి చెందిన వ్యక్తి. అగ్ని గ్రామం స‌మీపంలోనే ఓ పెద్ద గుడి ఉంటుంది. అగ్ని కులానికి చెందిన పూర్వీకులే ఆ గుడిని నిర్మిస్తారు. అయినా, త‌క్కువ కులానికి చెందిన వార‌నే సాకుతో అగ్నికి ఆ ఊరివాళ్ల‌కు ఆ గుడిలోకి ప్రవేశం ఉండదు. గౌరవం లేని తమ బతుకుల పై అగ్ని ఆవేదన చెందుతూ ఉంటాడు. ఐతే, ఆ గ్రామాన్ని తమ దేవుడు ‘ఘోర హరుడు’ కాపాడుతుంటాడని అక్కడి తెగ ప్రజలు తరతరాలుగా నమ్ముతుంటారు. ఇంతకీ, ఆ ‘ఘోర హరుడు’ ఎవరు?, అగ్నికి – ఆ ‘ఘోర హరుడు’కి సంబంధం ఏమిటి ?, ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య అగ్ని, బ్రిటిష్ వారి పై ఎలాంటి పోరాటం చేశాడు?, ఈ మధ్యలో శివన్న (శివ‌రాజ్‌కుమార్‌), రఫీ (సందీప్ కిషన్)ల పాత్రలు ఏమిటి ?, ఇంతకీ అగ్ని.. ‘కెప్టెన్ మిల్లర్’ గా ఎలా మారాడు? అనేది అసలైన కథ.

విశ్లేషణ : ఆ రోజుల్లో బ్రిటిష్ వారు పరిపాలన నేపథ్యం ఎలా సాగింది?, అప్పటి తక్కువ జాతి వారిని ఎలా అణచివేశారు? వంటి అంశాలతో పాటు ఆ అణచివేత నుంచి పోరాటం ఎలా పుట్టింది?, ముఖ్యంగా ఆధిపత్యం నుంచి పుట్టే తిరుగుబాటు ఎంతో బలంగా ఉంటుంది అనే కోణంలో సాగిన ఈ సినిమాలో ప్రధానంగా స్వేచ్ఛ కోసం, తమ గౌరవం కోసం చేసే పోరాటం చాలా బాగుంది. కులం పేరుతో అంటరాని వారంటూ పేరు బడిన అణగారిన వర్గాలను ధైర్యంగా గుడిలోకి కాలు మోపేలా చేయడమే ఈ కథలోని ప్రధాన పాయింట్. ఈ పాయింట్ చుట్టే కథ మొత్తం సాగింది. ఒక పోరాట వీరుడి కథగా ‘కెప్టెన్ మిల్లర్’ కథ నిజానికి గుండెలకు హత్తుకు పోవాలి, కానీ, దర్శకుడు అరుణ్ మతీశ్వరన్ రాసుకున్న ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ కావడం, ఎమోషన్స్ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాలేకపోవడం, అన్నిటికీ మించి కథ చాలా రొటీన్ గా, రెగ్యులర్ అండ్ బోరింగ్ సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే.. ‘కెప్టెన్ మిల్లర్’ పాత్రను, ఆ పాత్ర తాలూకు ఆర్క్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు, అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా ‘కెప్టెన్ మిల్లర్’ కథనాన్ని రాసుకోలేకపోయారు. పైగా కీలక సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. దీనికితోడు సెకండాఫ్ ని మరీ సాగతీశారు. ఇక కథను మలుపు తిప్పే కీలక పాత్రలు అయిన శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ పాత్రలను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.

నటీనటులు ఎలా చేశారంటే: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’గా తన అభిమానులను మాత్రమే ఆకట్టుకునే స్థాయిలో నటించాడు. అయితే.. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ అతడు మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో, తన రఫ్ అండ్ రగ్గడ్ లుక్స్ తో ధనుష్ చాలా బాగా నటించాడు. అతిథి పాత్రల్లో నటించిన ‘సందీప్ కిషన్, శివరాజ్ కుమార్’ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ బాగానే నటించింది. మరో కీలక పాత్రలో నటించిన నివేదిత సతీష్ చాలా చక్కటి నటనను కనబరిచింది.ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక విభాగం : అరుణ్ మతీశ్వరన్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా మాత్రం అంతగా నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో ఆయన ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఓకే . ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. సిద్థార్థ్ నూని సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు. ఎడిటింగ్ ఫర్వాలేదు.. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. మొత్తం మీద ‘కెప్టెన్ మిల్లర్’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో.. ధనుష్ నటన, సందీప్ కిషన్ – శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్ తో పాటు.. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఫర్వాలేదనిపించే స్థాయిలో ధనుష్ అభిమానులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా అలరిస్తుంది.