తప్పక చూడాల్సిన 6 తెలంగాణ అద్భుత జలపాతాలు…

అందమైన ప్రకృతి దృశ్యం, జలపాతాలూ కొండలూ ఓహ్ అద్బుతమైన సీనరీలు. ఇలాంటివి వెతుక్కుంటూ అరకు వరకూ వెళ్ళే పని లేదు. ఇలాంటి వాటి కోసం ఎక్కడికో వెళ్ళి మరీ చూసి వస్తూంటాం. ఇలాంటి అందమైన ప్రదేశాలు మన పక్కనే ఉన్నా పట్టించుకోం. ఎపుడో ఎవరో రాస్తే దాని చూసి, అరే, అవునా మన పక్కనే ఇంత మంచి విహారకేంద్రాలున్నాయా అనుకుంటుంటాం. ఈ అమాయకత్వం ఇక చాలు .వెంటనే పరిగెత్తి చూల్లేకపోయినా, మన దగ్గరలోనే ఉన్న ఎలాంటి ప్రదేశాలున్నాయో తెలుసుకుంటే మంచిది. తెలంగాణలో మనకు దగ్గరలోనే ఎన్నో మాంచి జలపాతాలున్నాయంటే ఆశ్చర్య పోతారు. వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం.

తమాషా ఏమంటే వాటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తూంటారు కానీ మనకు సరైన సమాచారం ఉండదు. అందుకే తెలంగాణాలో ఉన్న ఈ జలపాతాల గురించినాలుగు ముక్కలు చెప్పి ఎపుడైనా తీరికదొరికినపుడు మిమ్మల్ని వెళ్లేలా చేయడమే నా ఉద్దేశం.తెలంగాణ జలపాతాలన్నీ మనకు దగ్గరలోనే ఉన్నాయి. ఒక్క రోజు ప్రయాణంతో వీటిని చేరుకోగలం. ఈ సారి ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీటినీ మీ మస్ట్ విజట్ లిస్ట్ లో ఇపుడే చేర్చండి.

భీముని జలపాతం: వరంగల్ జిల్ల నర్సం పేట పట్టణం బుధరావు పేట గ్రామానికి సమీపంలోనే ఉన్న ఈ జలపాతం గురించి పెద్దగా ప్రచారం లేదు కానీ. మీరు ఆశ్చర్య పోయే ప్రకృతి సౌందర్యం ఈ ప్రదేశం సొంతం.చూడటానికి జలపాతం చిన్నగానే కనిపించినా. చుట్టూ ఉండే అడవి మిమ్మల్ని మైమరపిస్తుంది. అక్కడె ఉండే పాండవుల గుహలు అనే ప్రాచీన గుహలని కూడా చూడవచ్చు. దీనికి భీముని పాదం జలపాతం అని కూడా పేరుంది. అక్కడ ఉన్న కొండరాయి ఒకటి పాదం అకారంలోఉంటుంది. ఎందుకోగాని అది భీముని పాదంగా పేరు పొందింది. దాన్నుంచే జలపాతానిని భీముని జలపాతం అని పేరొచ్చింది.

ఫోటో డెక్కన్ క్రానికల్

ఎలా వెళ్లాలి: భీముని పాదం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వరంగల్. ఇది మనోహరాబాద్ -నర్ స్మా మధ్య ఉంటుంది. వరంగల్ కి 51 కి.మీ దూరం. హైదరాబాద్ నుంచి చేరుకోవడానికి 4 గంటలుపడుతుంది.

మల్లెల తీర్థం జలపాతం: తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే నల్లమల అడవుల్లో ఉందీ జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గంలో తేలికగానే ప్రయాణించవచ్చు. వర్షాకాలంలో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు.ఈ మల్లెల తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని ఒక నమ్మకం.. కానీ ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి.

ఫోటో తెలంగాణ టుడే

ఎలా వెళ్లాలి: శ్రీశైలానికి 58 కిమీ, హైదరాబాద్ కు 185కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్-శ్రీశైలం బస్ ఎక్కి శ్రీశైలం చేరుకుని అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని వెళ్ల వచ్చు.లేదా సొంత కారుంటూ ఝమ్మని చల్లగా ప్రయాణంచేసి జలపాతం చేరుకోవడం హాయి.

కుంటాల జలపాతం:
సహజ సిద్ధమైన జలపాతం కుంటాల జలపాతం. దాదాపు 45 మీటర్ల ఎత్తు నుంచీ పడే జలధార మిమ్మల్ని పరవశంలో ముంచెత్తుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్ కి దగ్గరలో ఉన్న ఈ కుంటాల జలపాతానికి విశిష్ట గుర్తింపు ఉంది. కుంటాల గ్రామానికి సమీపం లోని అభయారణ్యంలో ఈ జలపాతం ఉంది. ఈ నీటి సొబగులు- పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో వర్షాలు పడుతుండటంతో- కుంటాల జలపాతం మరింత అందాన్ని సంతరించుకుంది. ఈ జలపాతం వద్ద సహజసిద్ధమైన శివలింగం కూడా ఉంటుంది. శివరాత్రి రోజున గిరిజనులు పెద్ద ఎత్తున ఇక్కడి వచ్చి పూజలు చేస్తారు. ఈ వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటలకు వస్తుంటారు.

ఎలా వెళ్లాలి :ఆదిలాబాద్ కు 58 కిమి దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు రైళ్లున్నాయి. బస్సలున్నాయి. అదిలాబాద్ నుంచి కుంటాలా ఆర్టీసి బస్సులో వెళ్లవచ్చు.

పోచేరా జలపాతం: నిర్మల్ కి 37 కిలోమీటర్ల దూరంలో ఉందీ పోచెరా ఫాల్స్ ఎక్కువ ప్రచారంలో లేదు కానీ అద్బుతమైన సౌందర్యం ఈ ప్రాంతం సొంతం. ఎక్కువగ రాళ్ళు నీళ్ళలో మునిగి ఉంటాయి. లోతుకూడా ఎక్కువ. అందుకే ఇక్కడికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.కానీ మీరు ఇక్కడ చూసే ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. వర్షాకాలం మొదట్లో కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కానీ ఈ జలపాతం చూడటానికి వెళ్ళొచ్చు. మిగతా సమయాల్లో అంత పచ్చగా కనిపించదు.

ఫోటో తెలంగాణ టుడే

ఎలా వెళ్లాలి: సింపుల్. ఇది ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి 49 కిమీ. ఆదిలాబాద్ నుంచి పోచెరా దాకా ఆర్టీసి బస్ లో కూడా వెళ్ల వచ్చు. హైదరాబాద్ నుంచి 267 కిమీ దూరం.

సిర్నాపల్లి జలపాతం: సిర్నాపల్లి జలపాతం, జానకి బాయి జలపాతం నిజామాబాదు జిల్లాలోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి దగ్గరలో ఉంది.. నిజామాబాద్ నుంచి 20 కిలోమీటర్ల లోపే. ఇక్కడికి వెళ్ళటం చాలా సులబం. నిజామాబాద్ నుంచి ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు.

బోగతా జలపాతం: తెలంగాణాలో ఇదే పెద్ద వాటర్ ఫాల్స్. తెలంగాణా నయాగారా జలపాతం అని కూడా దీనికి పేరుంది. ఖమ్మం జిల్లా వాజెడు దగ్గరలో ఉందీ జలపాతం. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే.. ఎత్తైన పచ్చని చెట్లు, కొండల మధ్య ఉన్న అడవి నుంచి వెళ్లాలి. అడవి మధ్యలో అందమైన సెలయేర్లు కనువిందు చేస్తాయి. గుట్టల మధ్య నుంచి … ఆకాశమంత ఎత్తు నుంచి ధారలుగా నీళ్లు జారిపడుతుంటాయి. ఇక టూరిస్టుల సందడి ఈ అందాలను మరింత పెంచుతాయి.

ఫోటో ఎక్స్ ఫ్లోర్ తెలంగాణ

ఎలా వెళ్లాలి: వరంగల్ రైల్వే స్టేషన్ కు 140 కిమీ దూరంలో ఉంటుంది. వరంగల్ కు మంచి రైలు సౌకర్యం ఉంది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం మీదుగా చీకుపల్లి చేరుకోవాలి. అక్కడి నుంచి కనీసం రెండు కి.మీ అటవీ ప్రాంతం గుండా నడచుకూంటూ వెళ్లాలి.

ఇవి కాకుండా తెలంగాణలో ఇంకా చాలా జలపాతాలున్నాయి. మణుగూరు జలపాతం, గుండాల జలపాతం, పెద్ద గుండం జలపాతం, ముక్తి గుండం, జాది మల్కాపూర్, బోడకొండ, మిట్టే… ఇలా ఎన్నో.. వీటి గురించి మరొకసారి ముచ్చటించుకుందాం.

వడ్డే పల్లి చందు తో కలసి తెలుగు రాజ్యం టీం