తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మూడు దశల్లో ఎన్నికలకు ఏర్పాటు చేశారు. సర్కారు నజరానాలు ప్రకటించడంతో కొన్ని గ్రామాల్లో ఎన్నికలు ఏక్రగీవం అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నది. పార్టీల గుర్తులు లేకపోయినా ఎన్నికలు మాత్రం పార్టీల వారీగానే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికల పూర్వాపరాలు పరిశీలిస్తే… నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలంలో ఉన్న కొండకిందిగూడెం అనే చిన్న పల్లెటూరు 17 ఏండ్ల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద రికార్డు నెలకొల్పింది. అంత చిన్న గ్రామానికి అంత పెద్ద రికార్డు ఏందబ్బా అనుకుంటున్నారా? ఫుల్ స్టోరీ చదవండి.
అది 2001 సంవత్సరం. అప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కొండకిందిగూడెంలో కూడా ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ చట్టం ప్రకారం ఆ గ్రామంలో ఎస్సీ మహిళ కోటా వచ్చింది. దీంతో సిపిఎం మద్దతు తెలిపిన అభ్యర్థిగా వంగూరి మరియమ్మ, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కందుకూరి గంగమ్మ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో డబుల్ రికార్డు నెలకొల్పాయి.
ఒక్క ఓటుతోనే రెండుసార్లు గెలుపు
గ్రామంలో ఆ ఎన్నికల సమయంలో ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు. ప్రచారం ముగిసి… పోలింగ్ తేదీ రానే వచ్చింది. పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. ఎవరికి వారు తమదే గెలుపు అని రెండు వర్గాలు ఫుల్ ధీమాగా ఉన్నాయి. అయితే కౌంటింగ్ జరిగిన తర్వాత తేలిందేమంటే??? సిపిఎం మద్దతు తెలిపిన అభ్యర్థి మరియమ్మ ఒక్క ఓటుతో ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారైన కందుకూరి గంగమ్మ పై గెలుపొందారు. మరియమ్మకు 301 ఓట్లు రాగా, గంగమ్మకు 300 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నవేళ అలజడి రేగింది.
కేవలం ఒకే ఒక్క ఓటుతో సిపిఎం మద్దతుదారు మరియమ్మ గెలవడాన్ని గ్రామంలోని కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలింగ్ కేంద్రమైన బడి కాడ అలజడి రేగింది. కొందరు కాంగ్రెస్ నేతలు నానా హంగామా సృష్టించారు. పోలింగ్ ఆఫీసర్లను భయపెట్టారు. అంతేకాకుండా బ్యాలెట్ బాక్స్ లు ఎత్తుకుని పోయి వాటిలో ఇంకు (సిరా) పోసి వాటిని చెరువులో పడేశారు. ఊహించని రీతిలో ఈ ఘటన జరగడంలో రిటర్నింగ్ అధికారి ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే జరిగిన ఘటన సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసుకు చేరింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు గ్రామంలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. తర్వాత కేంద్ర బలగాలను గ్రామంలోకి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బంధీగా రీపోలింగ్ జరిపారు. విచిత్రం ఏమంటే రీపోలింగ్ లో కూడా సిపిఎం మద్దతుదారైన మరియమ్మ మళ్లీ ఒక్క ఓటుతోనే విజయం సాధించింది. దీంతో ఎవరి ఓట్లు వారికి పక్కాగా పడ్డాయి. పాత ఓట్లు ఎవరివి వారికే పడడంతో సిపిఎం మద్దతుదారైన మరియమ్మను విజేతగా ప్రకటించారు.
మలుపుతిప్పిన బొట్టు బిల్లలు
అయితే ఈ వ్యవహారం ఇక్కడ మరో మలుపు తిరిగింది. రెండోసారి పోలింగ్ వేళ సిపిఎం బలపరిచిన అభ్యర్థికి పడిన ఓట్లు చెల్లుబాటు కావని కాంగ్రెస్ నేతలు కోర్టులో చాలెంజ్ చేశారు. అయితే అక్కడ జరిగిన అసలు వ్యవహారం ఏమంటే? సిపిఎం మద్దతుదారులైన వారు తమకు ఓటు వేస్తారో లేదో అన్న అనుమానం ఉన్న వారందరికీ బొట్టుబిల్లలు పంపిణీ చేశారు. రకరకాల రంగుల్లో 12 బొట్టు బిల్లలు వారికి పంపిణీ చేశారు. ఓటు వేసే సమయంలో వారంతా ఆ బొట్టు బిల్లలు ఓటుకు అంటించాలని సూచించారు.
దీంతో వారంతా బొట్టుబిల్లలను బ్యాలెట్ పేపర్ వెనకాల అంటించి ఓటేశారు. ఈ కారణంగా ఆ ఓట్లు అన్నీ చెల్లుబాటు కావు అని కాంగ్రెస్ తరుపు వారు కోర్టులో ఫైట్ చేశారు. కేసు రెండేళ్లపాటు జిల్లా కోర్టు, హైకోర్టులో నడిచింది. తర్వాత హైకోర్టు నుంచి స్పష్టమైన డైరెక్షన్ వచ్చింది… ఏమని అంటే ఆ 12 ఓట్లు చెల్లుబాటు కావని. దీంతో 11 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారైన కందుకూరి గంగమ్మ గెలిచినట్లు హైకోర్టు తీర్పు వెలువరించింది.
24 నెలల పాటు ఒకరు సర్పంచ్ అయితే మిగతా సగం కాలానికి మరొకరు ఆ గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు. ఇలా రెండుసార్లు ఎన్నికల్లో ఒకే ఓటుతో గెలవడం, బొట్టు బిల్లలు గ్రామ సర్పంచ్ ఎన్నికలను శాసించడం అప్పట్లో జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది.
కొండకిందిగూడెం ఖాతాలో మరో రికార్డు
ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అనేది కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుంది. అందులోనూ నకిరేకల్ లో కమ్యూనిస్టు మహా నేత నర్రా రాఘవరెడ్డి వరుస విజయాలు సాధించారు. ఆయన నకిరేకల్ నుంచి 6 టర్మ్ లు సిపిఎం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మరో రెండు టర్మ్ లు ఇదే నకిరేకల్ నుంచి నోముల నర్సింహ్మయ్య గెలుపొందారు. తదనంతర కాలంలో రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో నోమల నర్సింహ్మయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరడం, నాగార్జున సాగర్ లో పోటీ చేయడం ఓడిపోవడం, తర్వాత ఇప్పుడు గెలవడం జరిగిపోయాయి.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగిన కాలంలోనూ కొండకిందిగూడెం రికార్డు నెలకొల్పింది. సారా వ్యతిరేక ఉద్యమంలో ఆంధ్రా లోని నెల్లూరు జిల్లా దూబకుంట గ్రామంలో మొదలైంది. అక్కడ ఊరు ఊరంతా ఛైతన్యవంతమై సారా వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీస్తే అది రాష్ట్రమంతా పాకింది. అయితే అంతటి ప్రధాన్యత తెలంగాణలో కొండకిందిగూడెం కు దక్కింది. ఆ స్పూర్తితో కొండకిందిగూడెంలో సారా వ్యతిరేక ఉద్యమం విజయవంతమైంది. ఊరంతా ఏకమై సారాను గ్రామానికి రానీయకుడా, తయారు చేయకుండా చేశారు. అదే సమయంలో గ్రామంలో దొరికిన సారా పాకెట్లను సెంటర్ లో కాల్చి చరిత్ర సృష్టించారు.
ఇప్పుడేంటి పరిస్థితి ?
రాజకీయ చైతన్యానికి మారు పేరు, నిప్పు కనికలాంటి కొండకిందిగూడెంలో ఈసారి ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ను నిలబెట్టేందుకు కొందరు ముఖ్యమైన నేతలు, కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే నామినేషన్ల నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కొండకిందిగూడెంలో ఎన్నికలు మూడో దశలో జరగనున్నాయి. అయితే పోటీ అనివార్యంగా కనబడుతున్నది. ఇప్పుడు రిజర్వేషన్ జనరల్ మహిళ వచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలో బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
కొండకిందిగూడెం… మానని గాయాలు
చైతన్యానికి మారుపేరైన కొండకిందిగూడెం గ్రామంలోనూ చీకటిరోజులు, మానని గాయాలు కూడా ఉన్నాయి. 1975 ప్రాంతంలో గోవింద రెడ్డి అనే నక్సలైట్ నాయకుడి కారణంగా కొండకిందిగూడెంలో పోలీసు బలగాలు క్యాంపు ఏర్పాటు చేసి గస్తీ తిరగాయి. గ్రామంలో జనాలను భయ్రభాంతులకు గురిచేసి దొరికిన వారిని దొరికినట్లు క్యాంపులోకి తీసుకుపోయి పోలీసులు చితకబాదారు.
గోవింద రెడ్డిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై గోవింద రెడ్డి పొగ బాంబు దాడి చేసి తప్పించుకున్నారట. ఆయన కొండకిందిగూడెం లోనే తలదాచుకున్నాడని భావించిన పోలీసులు గ్రామంలోకి ఎంటరయ్యారు. గోవింద్ రెడ్డి జాడ చెప్పాలంటూ గ్రామంలో మహిళలు, యువకులను పోలీసులు కుళ్ల బొడిచారు. అప్పుడు పోలీసులు చేసిన గాయాలను గ్రామ ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ఆ నొప్పులు ఇంకా మానిపోలేదని బాధిత గ్రామస్తులు చెప్పే మాట. ఆ ఘటనలో గాయపడిన అనేక మందికి ఇంకా ఆ జ్ఞాపకాలు పీడకలగా వెంటాడుతూనే ఉన్నాయి.
పోలీసులు ఊరి మీద పడి కోళ్లను, గొర్లు, మేకలను ధౌర్జన్యంగా కోసుకు తిని నానా భీభత్సం చేశారని ఇప్పటికీ చెబుతుంటారు. సుమారు వారం రోజులకు పైగా పోలీసు క్యాంపు నడిచింది. ఆ ఘటనలో ఆదిముళ్ళ దావీదు, దోనాల సత్తిరెడ్డి, అల్లి లింగయ్య, బక్కతట్ల మారెమ్మ, పెంబర్ల గంగమ్మ, అల్లి మల్లమ్మ, అల్లి లచ్చయ్య, ఆదిముళ్ల సామేలు, ఆదిముళ్ల జాన్, కోట్ల కనకమ్మ, గుండాల మల్లయ్య, రాసుకొండ్ల లక్ష్మయ్య, పాల్వాయి రామస్వామితో పాటు అనేక మందిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. దివంగత ఆదిముళ్ల దావీదు ను అత్యంత క్రూరంగా హింసించారు పోలీసులు. పచ్చిపులుసు మెతుకులు తినిపించి పొట్టమీద రోకలిబండతో తొక్కి చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనలో అనేకమంది బాధితులు ఇప్పడు జీవించి లేరు. నైజాం కాలంలో రజాకార్ల కాలంలోనూ కొండకిందిగూడెంలో వారు చిత్రహింసలకు గురిచేసిన ఘటనలున్నాయి.
విష జ్వరాలతో అతలాకుతలం
ఇక 2016 సెప్టెంబరులో కొండకిందిగూడెం గ్రామంలో విష జ్వరాలు వ్యాపించడంతో గ్రామంతా అతలాకుతలం అయింది. 222 మందికి విష జ్వరాలు సోకాయి. అల్లి శ్రీను అనే యువకుడు ఈ విషజ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో కొన్ని ఇండ్లలో అయితే అందరికీ జ్వరం వచ్చింది. నయం చేయించుకునేందుకు కొన్ని కుటుంబాలు ఐదు లక్షల వరకు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. సుమారు కోటి రూపాయలకు పైగా గ్రామ ప్రజలు తమ సొమ్మును దావాఖాన్లకు ధారపోయాల్సి వచ్చిందని చెబుతారు. ఈ విష జ్వరాల సమయంలో గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో విష జ్వరాలపై అప్పట్లో నవ తెలంగాణ పత్రిక సహా అనేక పత్రికలు వరుస కథనాలు ప్రచురించింది.
