ఒక సాధరణ రైతు బ్యాంకు అకౌంట్ లో ఏకంగా ఒకేసారి రూ. 473 కోట్లు జమ అయింది. అసలు కలలో కూడా ఊహించలేనంత డబ్బు తన అకౌంట్ లో జమ కావడం ఆ రైతు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే , ఆ డబ్బు ఎలా వచ్చింది , ఆ తర్వాత ఏమైంది అనే విషయాలని చూస్తే .. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది.

సంజీవరెడ్డి బుధవారం పక్కనున్న సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కి వెళ్లాడు. డబ్బులు అవసరం ఉండగా ఏటీఎం కార్డు ద్వారా డీసీసీబీ ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డబ్బులు రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలోని బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఖాతాలో రూ.473,13,30,000 అని ఉంది.
అయితే తన ఖాతాలో అన్ని డబ్బులు ఉన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు గురువారం భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం తెలపగా వారు చెక్ చేసి ‘మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది.. ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదు’.. అని సమాధానం ఇచ్చారు. ఏటీఎం రిసిప్ట్లో భారీ మొత్తంలో బ్యాలెన్స్ చూపిస్తోందని చెప్పగా.. ‘మీ ఖాతాలో కేవలం రూ.4వేల చిల్లర మాత్రమే ఉందని’సమాధానం ఇచ్చారు. స్థానికంగా ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.
