లక్షల్లో నకిలీ ఓట్లు..అర్హుల ఓట్లు గల్లంతు

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆరోపిస్తున్నట్లు లక్షల సంఖ్యల గల్లంతైన ఓట్లు వ్యవహారం బయటపడుతోంది. ఈరోజు పోలింగ్ సందర్భంగా కుకట్ పల్లి నియోజకవర్గంలో చాలా పోలింగ్ కేంద్రాల్లో రెండు రకాల గొడవలు మొదలయ్యాయి. ఒకటి పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఇంకోవైపు అంతే స్ధాయిలో అర్హులైన వారి ఓట్లు గల్లంతయ్యాయి. కుకట్ పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు బయటపడటంతో కలకలం మొదలైంది. రెండు ఇళ్ళల్లోని భారీ ఎత్తున నకిలీ ఓట్లు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ఇంట్లో 74 ఓట్లు, మరో ఇంట్లో 68 ఓట్లు బయటపడ్డాయి.

ఒకే ఇంట్లో అన్నేసి ఓట్లు బయటపడటం ఒకఎత్తైతే అసలు ఆ రెండు ఇళ్ళు కూడా చాలాకాలంగా పాడుపడిపోయుండటం మరో ఎత్తు. అంటే ఆ రెండు ఇళ్ళల్లో చాలా కాలంగా ఎవరూ నివసించటం లేదని స్ధానికులు చెబుతున్నారు. ఎవరూ నివసించని ఇళ్ళల్లో అంత పెద్ద సంఖ్యలో ఓట్లు ఉండటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే విషయమై కాంగ్రెస్ నేత మర్రిశశిధర్ రెడ్డి టిఆర్ఎస్ పై కోర్టుల్లో పెద్ద పోరాటమే చేశారు. అయినా ఉపయోగం కనబడలేదు. తమకు పడవు అన్న అనుమానం వచ్చిన ఓట్లను లక్షల సంఖ్యలో తొలగించేసినట్లు టిఆర్ఎస్ నేతలపై ఆరోపణలున్నాయి. ఈ విషయంపైనే కాంగ్రెస్ ఎంత ఫైటింగ్ చేసినా ఉపయోగం కనబడలేదు.

భోగస్ ఓట్లు ఒక వైపు బయటపడుతున్న సమయంలోనే అర్హులైన ఓటర్లను జాబితాలో నుండి తొలగించారు. జాబితాలో ఓట్లు గల్లంతైన వారంతా అధికారులతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. తమ దగ్గర గుర్తింపు కార్డులున్నాయి కాబట్టి తమకందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వాలంటూ జాబితాలో పేర్లు గల్లంతైన వారంతా అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు.  ఎన్ని గుర్తింపు కార్డులున్న ఓటర్ల జాబితాలో పేరు లేని కారణంగా అధికారులు ఓట్లను నిరాకరిస్తున్నారు.  ఒక్క భరత్ నగర్ లోనే గల్లంతైన ఓట్లు కొన్ని వేలుంటాయని అంచనా.  అంటే నియోజకవర్గంలో లక్షల ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే పరిస్ధితి తెలంగాణా వ్యాప్తంగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ ఆరోపణలు చేయటంలో వాస్తవముందన్నది తేలిపోతోంది.