వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ వీడేదెప్పుడు.?

Viveka Death Myster : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాజకీయంగా చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతూనే వుంది. 2019 ఎన్నికల సమయంలో జరిగిన అత్యంత కిరాతకమైన హత్య ఇది. ఇంతటి కిరాతకమైన హత్యను ‘గుండె పోటు’గా అభివర్ణించారు అప్పట్లో కొందరు వైసీపీ నేతలు. అది గుండె పోటు కాదు, గొడ్డలి పోటు.. అని తేలడానికి కొంత సమయం పట్టింది.

గొడ్డలి వేటు కారణంగా అయిన గాయాలకు కట్లు కట్టేసి, హత్య విషయం బయటపడకుండా చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణల్ని విపక్షాలు చేయడం చూస్తున్నాం. సాక్షాత్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా ఈ హత్యకు సంబంధించి పలువురిపై ఆరోపణలు చేశారు, మరికొందరిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

చిత్రమేంటంటే, సాక్షాత్తూ సునీత భర్త, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసినట్లుగా వైసీపీ నుంచి కొందరు ఆరోపణలు చేయడం చూశాం. ఇప్పటికీ ఈ కేసు ఆయా రాజకీయ పార్టీల రాజకీయ విమర్శలకు పనికొస్తోంది తప్ప, కేసులో దోషులెవరో తేలడంలేదు.

తాజాగా, సీబీఐ అధికారులకు బెదిరింపులొచ్చాయంటూ ప్రచారం జరుగుతోంది. కేసు విచారణ సాగుతోంది.. నిందితుల బెయిల్ పిటిషన్లకు సంబంధించిన విచారణ సందర్భంగా సునీత కూడా ఇంప్లీడ్ అవుతున్నారు. మూడేళ్ళు దాటుతోంది వివేకా హత్య జరిగి.. ఇంకో రెండేళ్ళ తర్వాత అయినా ఈ మిస్టరీ వీడుతుందా.? చెప్పడం కష్టమే.