నరేంద్ర మోడీజీ.. వ్యాక్సిన్ ఉత్సవం అంటే ఇదే.!

The Actual Vaccine Festival Is Here In Andhra pradesh

The Actual Vaccine Festival Is Here In Andhra pradesh

దేశంలో వ్యాక్సిన్లు తగినంత స్థాయిలో లభ్యత లేకపోయినా, ‘వ్యాక్సిన్ మహోత్సవ్’ని ప్రకటించేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం. మొత్తం వ్యాక్సిన్ లభ్యత వ్యవహారాల్ని తన గుప్పిట్లో పెట్టుకుని, వ్యాక్సినేషన్ వైఫల్యాల్ని రాష్ట్రాల మీదకు నెట్టేసింది కూడా మోడీ ప్రభుత్వమే.

రాష్ట్రాలకు ఒక ధర, కేంద్రానికి ఇంకో ధర.. అంటూ చిత్ర విచిత్రమైన పద్ధతులు తీసుకొచ్చి, అభాసుపాలయ్యింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు మొట్టికాయలతో, రాష్ట్రాల చీవాట్లతో కేంద్రం దిగొచ్చింది. నేటి నుంచి దేశంలో అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా అందనుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం సొంతగా ఖర్చు చేసి వ్యాక్సిన్లు పొందాల్సిందే.

రాష్ట్రాలకు అవసరమైన మేర కేంద్రం, ఉచితంగానే వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది. కాగా, నిన్న రికార్డు స్థాయిలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పదమూడున్నర లక్షల మందికి పైగా డోసుల వ్యాక్సిన్ అందించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. దేశంలో అన్ని రాష్ట్రాలూ ఇదే పద్ధతి అవలంభిస్తే.. అతి కొద్ది రోజుల్లోనే దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుతుంది.

కానీ, అదంత తేలికైన వ్యవహారం కాదు. ఎందుకంటే, వ్యాక్సిన్లు రాష్ట్రాలకు సమకూర్చాల్సింది కేంద్రమే. ఏ రాష్ట్రమైతే టీకాలను సమర్థవంతంగా ప్రజలకు అందిస్తుందో, ఆ రాష్ట్రాలకు వ్యాక్సిన్ కోటాలో ప్రాధాన్యతనిస్తామని కేంద్రం ప్రకటించడంతో.. ఆంధ్రపదేశ్ రాష్ట్రం ముందడుగు వేసింది. సరికొత్త రికార్డు నెలకొల్పింది.

నిజానికి, అసలు సిసలు వ్యాక్సిన్ మహోత్సవం ఇదే. ఈ దిశగా మిగతా రాస్ట్రాల్ని కూడా కేంద్రం ప్రోత్సహించాలి. తగినన్ని వ్యాక్సిన్లనూ సమకూర్చాలి.. సమకూర్చితే, అతి త్వరలో దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోవచ్చు. మూడో వేవ్ ముప్పు నుంచి దేశం తప్పించుకోవచ్చు.