
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. అలాంటి ఎన్నికల్ని కుంటి సాకులు చూపిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబు బహిష్కరించేశారు. కానీ, కార్యకర్తలు మాత్రం అధినేత నిర్ణయాన్ని సమర్థించడంలేదు. కింది స్థాయి నేతలదీ అదే పరిస్థితి. కొందరు నేతలు ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసేశారు. ఇంకొందరేమో, అధినేత నిర్ణయాన్ని స్వాగతించలేం.. అలాగని, ఆయన్ని ఎదిరించలేమని అంటున్నారు. స్థానికంగా వున్న పరిస్థితుల దృష్ట్యా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నామంటూ కొందరు టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం. మరోపక్క, తిరుపతిలో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.
తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో టీడీపీకి ఎందుకు ఓటెయ్యాలంటూ కార్యకర్తలే నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘మేం జెండా పీకేసినట్టే వుంది పరిస్థితి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపోటముల సంగతి తర్వాత.. ముందైతే పార్టీ క్యాడర్లో ఉత్సాహం వస్తుంది.. కానీ, చంద్రబాబు నిర్ణయం.. పార్టీని నాశనం చేసేసేలా వుంది. ఆ ప్రభావం తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నిక మీదా పడబోతోంది..’ అంటూ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. చంద్రబాబు నిర్ణయం తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మికి కూడా పెద్ద షాకే ఇచ్చిందట. చంద్రబాబు టైమ్ చూసి వెన్నపోటు పొడిచారని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అధికార పార్టీ పన్నిన ట్రాప్లో చంద్రబాబు పడిపోయిన వైనం.. సుస్పష్టంగా కనిపిస్తోందిక్కడ. దేశంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న వామపక్షాలు, ఎన్నికల్ని బహిష్కరించకుండా ఎప్పటికప్పుడు గట్టిగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో తమకు ఉనికి లేకపోయినా ప్రయత్నిస్తూనే వుంది. మరి, టీడీపీకే ఎందుకు ఈ బహిష్కరణ పైత్యం? అన్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన. ఏప్రిల్ 1న ఆల్ ఫూల్స్ డే సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికలో టీడీపీ మీద వచ్చిన కథనం నిజమయ్యేలానే వుంది.
