వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో తెలుగు-హిందీ భారీ యాక్షన్ డ్రామా

తమ తొలి తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతోంది. వైవిధ్యమైన చిత్రాలతో విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ఈ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన కంచె (2015)తో వరుణ్ విశేషమైన గుర్తింపు పొందారు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా రాబోతున్న ఈ నూతన చిత్రం నవంబర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది.ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి, వైమానిక దాడులతో పోరాడుతున్నప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్లను మునుపెన్నడూ చూపని విధంగా రూపొందబోతోంది.

ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ..

”ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ గా నటించే అవకాశం రావడంతో పాటు బిగ్ స్క్రీన్‌పై వారి సాహసాలని చాటే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. గ్లోబల్ దిగ్గజం సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌ల భాగస్వామ్యంతో మేము చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి  గొప్ప నివాళిగా భావించే చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాను. ఒక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా వుంది. నా పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఈ పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను. ప్రేక్షకులు దీనికి ఎలా స్పందిస్తారో చూడడానికి ఎక్సయిటెడ్ గా వున్నాను” అన్నారు.

ఇండియా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేన్ సింగ్ మాట్లాడుతూ ” ఒక స్టూడియోగా దేశం గర్వించదగ్గ  నిజమైన హీరోల కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మా గత చిత్రం మేజర్‌లో ఇది కనిపించింది.   ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి వరుణ్ తేజ్, శక్తి ప్రతాప్ సింగ్, సందీప్ ముద్దాతో కలిసి పని చేయడంపై సంతోషిస్తున్నాము. ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

నిర్మాత సందీప్ ముద్దా మాట్లాడుతూ,

“ఈ సినిమా ప్రయాణంలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అందరూ కలిసి ఒక గొప్ప చిత్రాన్ని ఇవ్వడం కోసం కష్టపడుతున్నందుకు గర్వపడుతున్నాను. ఇది యాక్షన్, హార్ట్‌తో నిండిన అద్భుతమైన చిత్రమే కాదు,  మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగాలను కూడా రేకెత్తిస్తుందని నమ్ముతున్నాను. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారి మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌ అపార అనుభవంతో ఈ కథనాన్ని అందించినందుకు ఆనందంగా వుంది” అన్నారు

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు – ఒక అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు. హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ ఏడాది నవంబర్ లో సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ చిత్రం 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, షెబ్నెమ్ ఆస్కిన్ , మైఖేల్ రిఫ్కిన్ నిర్వహణలో , సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మోషన్ పిక్చర్ గ్రూప్  ప్రాంతీయ భాషా నిర్మాణ విభాగం. ఇది ప్రపంచవ్యాప్తంగా 12 ప్రాంతాలలో ఏటా 30 చిత్రాలను విడుదల చేస్తోంది.

ఈ రోజు హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో గ్రాండ్ జరిగిన పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైయింది. పద్మజా కొణిదెల కెమరా స్విచ్ ఆన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు.