‘రంగ రంగ వైభవంగా..’ సినిమా నుంచి ‘సిరి సిరి మువ్వల్లోనే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

‘సిరి సిరి మువ్వల్లోనే నా గుండె చప్పుళ్లన్నీ..
నా గుప్పెడు గుండెళ్లోనే వినిపించాయే..” అని ప్రేయసి కేతికా శర్మను చూసి ఆనంద డోలిక‌ల్లో ఊగిపోతున్నారు హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్‌. అందుకు ఆమె

”నడి రాతిరి జాబిలీలోని కొలువుండే వెన్నెలలన్నీ
నా కళ్లకు పట్టపగలే కనిపించాయి…” అంటూ ప్రేమ ఊహల్లో ఊగిపోతుంది.

అసలు వీరిలా ప్రేమ మైకంలో ఉండటానికి గల కారణాలేంటో తెలుసుకోవాలంటే ‘రంగ రంగ వైభవంగా..’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శకుడు గిరీశాయ, నిర్మాతలు బి.వి.ఎస్.ప్రసాద్, బాపినీడు.

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా.. సోమవారం ఈ సినిమా నుంచి ‘సిరి సిరి మువ్వల్లోనే ..’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ, శ్రియా ఘోషల్ ఆలపించారు. రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ అందించిన క్యూట్ మెలోడీసాంగ్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.