రవితేజ జోరు.. ఆనందంలో మాస్ మ‌హ‌రాజా ఫ్యాన్స్

ఒక్క హిట్ వచ్చినందుకే ఇంత జోరు పెంచేస్తున్నాడా..? వామ్మో మాస్ రాజా మామూలోడు కాదు అంటున్నారు ఆడియన్స్. రవితేజ జోరు చూస్తుంటే ఇంతకంటే ఏం అంటారులే మరి..? మొన్న సంక్రాంతికి విడుదలైన క్రాక్ సంచలన విజయం సాధించింది. దాదాపు 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఆహాలో విడుదలైన తర్వాత అక్కడా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపులో వరస సినిమాలకు కమిట్మెంట్ ఇస్తున్నాడు మాస్ రాజా. ఇప్పటికే ఖిలాడి సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 28న విడుదల కానుంది. ఈ సినిమా ఇలా ఉండగానే మరో రెండు సినిమాలకు కూడా మాస్ రాజా కమిటైనట్లు తెలుస్తుంది.

చాలా రోజులుగా వార్తల్లోనే ఉన్న త్రినాథరావు నక్కిన సినిమాను ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. అభిషేక్ అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రామ్ హలో గురు ప్రేమకోసమే సినిమా తర్వాత వీళ్లు చేస్తున్న సినిమా ఇదే. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే ఈ సినిమా ఉండబోతుందంటున్నాడు దర్శకుడు త్రినాథరావు. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి. గులాబీ శ్రీను అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి రవితేజ సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈయన గోపీచంద్ మలినేని దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసాడు. క్రాక్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు గులాబీ శ్రీను. ఈ రెండు సినిమాలు ఇలా ఉండగానే ఇప్పుడు మరో సినిమాకు కూడా రవితేజ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోయపాటి శ్రీనుతో వర్క్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజనే. 15 ఏళ్ళ కింద ఈ కాంబినేషన్ లో వచ్చిన భద్ర సినిమా సంచలన విజయం సాధించింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ రవితేజతో సినిమా చేయడానికి బోయపాటి సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఏదేమైనా కూడా రవితేజ జోరు చూస్తుంటే మాత్రం కాక పుడుతుంది.